మంగళవారం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్పై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంవత్సరం గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్లోనే జరపాలంటూ ‘భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి’ నేడు బైక్ ర్యాలీకి పిలుపునిచ్చింది. అయితే ఈ బైక్ ర్యాలీకి ముందుగా ఎలాంటి అనుమతి తీసుకోలేదని, దీనిని అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. అయితే పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా, ఉత్సవ సమితి నాయకులు దీనిని కొనసాగించడంతో నెక్లెస్ రోడ్లో ఈ బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఉత్సవ నిర్వహకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి తోపులాటకు దారి తీసింది. ఈ నేపథ్యంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావుతో పాటు ఇతర సమితి నాయకులను అరెస్ట్ చేసి రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్కు తరలించారు.
కాగా దీనిపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో.. ‘భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాను. హిందువుల పండుగలను ప్రశాంతంగా జరగనియ్యరా? గణేష్ నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా జరపాలని అడిగితే అరెస్ట్ చేస్తారా? నిమజ్జనం కోసం ముందస్తు ఏర్పాట్లు చేయాలని అడిగితే అరెస్ట్ చేయడమేంటి?’ అని ప్రశ్నించారు. ఇంకా ఆయన..’ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరగాలని మేం అనుకుంటున్నాం..రాచిరంపాన పెట్టాలని సీఎం చూస్తున్నడు. ఇతర వర్గాల పండుగలకు రాని ఇబ్బందులు హిందువుల పండుగలకే ఎందుకు? హిందూ సమాజమంతా ఆలోచించాలని కోరుతున్నా. హిందూ సమాజమంతా సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైంది’ అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ