తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేడు ప్రారంభం కానుంది. నేటి సాయంత్రం అలంపూర్ నుంచి ప్రారంభం కానున్న ఈ రెండో విడత పాదయాత్రను బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో.. ఈరోజు ఉదయం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్దనున్న బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం బండి సంజయ్ అలంపూర్ చేరుకుంటారు. అలంపూర్ జోగులంబ ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పాదయాత్ర ప్రారంభం కానున్న క్రమంలో ఈ సాయంత్రం ఆలంపూర్లో జరిగే బహిరంగ సభలో సంజయ్ పాల్గొననున్నారు. మొదటి రోజు సంజయ్ నాలుగు కిలోమీటర్లు నడిచి రాత్రి ఇమామ్ పూర్ లో బస చేస్తారు. రెండోరోజు నుంచి 13కి. మీ చొప్పున యాత్ర చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
నెలరోజులపాటు సాగనున్న ఈ రెండో విడత పాదయాత్ర మే 14న మహేశ్వరంలో ముగియనుంది. జోగులాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లోని 10 నియోజకవర్గాల పరిధిలో 105 గ్రామాల్లో యాత్ర కొనసాగనుంది. భారతదేశంలో రాజ్యాంగాన్ని తిరగరాయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అంబేద్కర్ను, రాజ్యాంగాన్ని అవమానించారని, అందుకే దీనిపై నిరసన తెలుపుతూ రెండో విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభిస్తున్నానని సంజయ్ తెలిపారు. తొలివిడత చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు ప్రజల్లో మంచి ఆదరణ లభించిందని, అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఎదురుచూస్తోందని బండి సంజయ్ కుమార్ బుధవారం అన్నారు. ర్యాలీ ముగింపు సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని సంజయ్ తెలిపారు. ఇతర కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు కూడా హాజరుకానున్నారు. కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, అందుకే పాదయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయని సంజయ్ అభిప్రాయపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ