తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం అసెంబ్లీ వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదేళ్ల మోదీ పాలనలో దేశం అభివృద్ధి చెందకపోగా.. నానాటికీ అనేక రంగాల్లో దిగజారుతోందని, అలాగే పార్లమెంటులో అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ కనీసం స్పందించకపోవడం వంటి తదితర అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్లానలలో వైఫల్యాలను గురించి వివరిస్తూ.. తన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సైతం సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.
ఈ సందర్భంగా కోరుట్లలో జరిగిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు తాను ఇచ్చిన హామీలు నెరేవేర్చలేదని, ప్రజల దృష్టిని దీనినుంచి మళ్లించేందుకే అసెంబ్లీలో ఆయన ప్రధానమంత్రిపై అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ సెంటిమెంట్ను మళ్లీ రెచ్చగొట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం ఏమి చేసింది, రాష్ట్రానికి ఎంత నిధులు విడుదల చేసింది, గడిచిన తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రజల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేసింది అనే దానిపై బీజేపీతో బహిరంగ చర్చకు రావాలని సంజయ్ బీఆర్ఎస్ నేతలకు ఛాలెంజ్ చేశారు. నిరుద్యోగ భృతి, రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడం, కొత్త ఉద్యోగాలు, పంట రుణాల మాఫీకి బడ్జెట్లో కేటాయింపులు సరిగా లేకపోవడం, చేనేత బంధు, గిరిజన బంధు అమలు, ఢిల్లీ మద్యంలో కుటుంబ సభ్యుల ప్రమేయం వంటి అమలుకాని హామీలపై సీఎం ఎందుకు మాట్లాడలేదని సంజయ్ ప్రశ్నించారు.
‘పెహలీ బార్, దళిత్ సర్కార్’ ఎంత నిజమో.. ‘అబ్ కీ బార్, ఆబ్కారీ సర్కార్’ అంతే నిజమని, కేసీఆర్ మాటలు ప్రజలు విస్వసించడంలేదని పేర్కొన్నారు. 2024లో మోదీ ప్రభుత్వం పనైపోతోందని సీఎం చెబుతున్నారని, కానీ అంతకుముందే ఈ ఏడాదే తెలంగాణలో కేసీఆర్ ఖేల్ ఖతం కాబోతోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించేందుకు సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ చర్చను దుర్వినియోగం చేశారు. ఇది నిబంధనల ఉల్లంఘనేనని, అసెంబ్లీలో లేని వ్యక్తిని, సభలో లేని వ్యక్తిని సీఎం దుర్భాషలాడడం తగదన్నారు. గతంలో తాను పార్లమెంటులో మాట్లాడితే చర్యలు తీసుకోవాలని వారి పార్టీ నేతలు ఫిర్యాదు చేశారని, మరి ఈరోజు ఆయన చేసిందేమిటి? సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడొచ్చా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ మాట్లాడినవన్నీ అబద్దాలేనని ఆధారాలతో సహా నిరూపించేందుకు బీజేపీ సిద్ధమని, డేట్, టైం డిసైడ్ చెయాలని, తాము నిరూపిస్తే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినట్లు రాజీనామా చేయడానికి సిద్ధమా? అని బండి సంజయ్ సవాల్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE