ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపైన కేబినెట్ చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది.
రాష్ట్ర కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే:
పల్లె ప్రగతి పట్టణ ప్రగతి:
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతి పై చర్చతో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పంచాయితీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖలు కేబినెట్ కు నివేదికలు సమర్పించాయి. వచ్చే నెల రోజుల లోపు, రాష్ట్రంలో నూటికి నూరుశాతం వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రులను, అధికారులను సీఎం ఆదేశించారు. ఇకమీద అన్ని గ్రామ పంచాయితీల్లో, వీధి దీపాల కొరకు మూడో వైర్ ను తప్పకుండా ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖకు సీఎం స్పష్టం చేశారు.
మున్సిపాలిటీల అభివృద్ధి:
మున్సిపాలిటీల అభివృద్ధి కోసం చేపట్టవల్సిన చర్యలమీద కేబినెట్ చర్చించింది. హైదరాబాద్ నగర శివారులోని మున్సిపాలిటీల పరిధిలో మంచినీటి సమస్యపై కేబినెట్ చర్చించింది. ఇప్పటికే విడుదల చేసిన నిధులకు అదనంగా మరో రూ.1200 కోట్లను మంజూరు చేసింది. నీటి ఎద్దడి నివారణకై తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణ పట్టణాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో గృహ నిర్మాణాల కోసం అభివృద్ధి చేసే లే-అవుట్లలో, లాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేయాలనే అంశం పై కేబినెట్ చర్చించింది. అందుకు సంబంధించిన అవకాశాలను అన్వేషించాలని, విధి విధానాలపై దృష్టిసారించాలని, మున్సిపల్ శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది.
రెసిడెన్షియల్ స్కూళ్లలో స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్:
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆయా నియోజకవర్గాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులకు 50 శాతం సీట్లను కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ప్రతి నెలా జరిగే సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ లను విధిగా ఆహ్వానించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై చర్చ:
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏడు జిల్లాలలో పర్యటించి వచ్చిన ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర అధికారులు, ఆయా జిల్లాలలో నెలకొన్న కోవిడ్ పరిస్థితి, తీసుకున్న చర్యలు, నివారణకై ఇచ్చిన సూచనలు, తదితర క్షేత్రస్థాయి పరిశీలనలను కేబినెట్ కు వివరించారు.
మందులు, ఆక్సీజన్ లభ్యత, ఇతర మౌలిక వసతులు సౌకర్యాలపై కేబినెట్ పూర్తిస్థాయిలో చర్చించింది. వ్యాక్సినేషన్, పడకల లభ్యత, ఔషదాల లభ్యత సహా మూడో వేవ్ కు సంబంధించిన సన్నద్దత గురించి వైద్యారోగ్యశాఖ అధికారులు కేబినెట్ కు సమాచారం అందించారు. కరోనా నియంత్రణకు సంబంధించి వైద్యారోగ్యశాఖకు ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల అనుమతులను ఇచ్చిన నేపథ్యంలో మందులను అందుబాటులో ఉంచడం, జ్వర సర్వేతో సహా అన్నిరకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. ఇక బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి మళ్ళీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ