తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం, వేతనాలు, ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వంటి అంశాలను ఫిబ్రవరిలోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సెక్రటెరియట్, హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ (హెఛ్ఓడీఎస్) మరియు జిల్లా స్ధాయిలలో ఉద్యోగుల పదోన్నతులను ఎటువంటి జాప్యం లేకుండా జనవరి 31 లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులను, హెఛ్ఓడీల ఉన్నతాధికారులను ఆదేశించారు.
సోమవారం నాడు బిఆర్కెఆర్ భవన్ లో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు మరియు కార్యదర్శులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశం నిర్వహించారు. పదోన్నతలుతో (ప్రమోషన్ల) పాటు కారుణ్య నియామకాల ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలన్నారు. ప్రమోషన్లు ఇవ్వడం వలన వచ్చే ఖాళీలను కూడా ప్రత్యక్ష నియమాల నోటిఫికేషన్లలో చేర్చాలని ఆదేశించారు. ప్రమోషన్లు, కారుణ్య నియామకాలు, డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పోస్టుల భర్తీ అంశాలపై ప్రతి వారంలో బుధవారం (జనవరి 6, 20, 27 తేదీలలో) సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ విజన్ ప్రకారం అన్ని శాఖల కార్యదర్శులు, హెఛ్ఓడీలు ఈ అంశాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారులు అనురాగ్ శర్మ, కె.వి.రమణా చారి, ఎ.కె.ఖాన్, ఎస్.కె.జోషి లతో పాటు డిజిపి మహేందర్ రెడ్డి, పోలీస్ అధికారులు పూర్ణ చందర్ రావు, గోపి కృష్ణ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాణి కుముదిని, సురేష్ చందా, అధర్ సిన్హా, ముఖ్యకార్యదర్శులు రజత్ కుమార్, అర్వింద్ కుమార్, రామక్రిష్ణారావు, సునీల్ శర్మ, జయేష్ రంజన్, రవిగుప్తా, హర్ ప్రీత్ సింగ్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా అగర్వాల్, పి.సి.సి.ఎఫ్ శోభ కార్యదర్శులు మరియు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ