తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన జిల్లా నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభించనున్నారు. దీనితో పాటు జిల్లాలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయానికి కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇక సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవితలు ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలకు చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు కార్యాలయాల ప్రారంభోత్సవ ఏర్పాట్లతో పాటు వసతులను, హెలిప్యాడ్ నిర్మాణాన్ని పరిశీలించి అధికారులకు కీలక సూచనలిచ్చారు.
కాగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పరిపాలన మరియు ప్రజల సౌకర్యార్ధం అన్ని శాఖల కార్యాలయాలు, అధికారులు ఒక దగ్గరే ఉండి విధులు నిర్వర్తించేలా సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు ప్రారంభమవగా, రేపు మహబూబాబాద్ జిల్లాలో, అలాగే ఈనెల 18న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదేరోజు ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ తొలి భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక ఈ సభకు ఆమ్ ఆద్మీ (ఆప్) పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్ట్ పార్టీ నేత, కేరళ సీఎం విజయన్, పంజాబ్ సీఎం భగవంత్మాన్, యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్తో పాటుగా మరికొందరు కీలక జాతీయ నేతలు హాజరకానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE