హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గజం భూమి కొనాలన్నా లక్షలు ఖర్చు పెట్టాల్సిన డిమాండ్ ఏర్పడింది. తాజాగా నగర శివారులోని కోకాపేట నియోపోలిస్ భూముల వేలం.. ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం తెచ్చిపెడుతుండటంతో.. ఆక్షన్ జరిగి రెండు రోజులు దాటిపోయినా ఆ రియల్ భూమ్ హీట్ను మాత్రం జనాలు మరచిపోవడం లేదు. హైదరాబాద్ చరిత్రలోనే ఎకరా భూమి అత్యధిక ధర పలికి రియల్టర్స్నే ఆలోచనలో పడేసింది. గతేడాదే భారీ స్థాయిలో ఆదాయం వచ్చిందనుకుంటే.. ఇప్పుడు వేలం నిర్వహిస్తోన్న ఫేజ్-2లో ప్లాట్లు రికార్డు స్థాయి ధరకు అమ్ముడవడంతో హెచ్ఎండీఏ అధికారుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఒక్క ఎకరానికి ఏకంగా వంద కోట్లకు పైగా అమ్ముడుపోవడంతో తెలంగాణ సర్కార్ సంతోషంతో తలమునకలవుతోంది. కిందటిసారి వేలంలో కంటే గరిష్ఠ ధర ఎకరాకు 40 కోట్లు ఎక్కువగా పలకగా… ఈసారి రికార్డ్ స్థాయిలో రేటు పలికడంతో.. ఇదే ఊపుతో బద్వేల్ భూముల వేలానికి రెడీ అయిపోయింది.
కోకాపేటలోని నియో పోలిస్లో రెండో విడతగా ఏడు ప్లాట్లలోని 45.33 ఎకరాలకు HMDA ఈ-వేలం నిర్వహించింది. షాపూర్జీ పల్లోంజీ, APR, మై హోం, రాజ్పుష్పా తదితర దిగ్గజ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలే కాకుండా… కొన్ని చిన్న సంస్థలు పోటాపోటీగా ఈ-వేలంలో పాల్గొన్నాయి. ఉదయం గరిష్ట ధర ఎకరాకు 75.50 కోట్లు పలకగా, మధ్యాహ్నం సెషన్లో ఏకంగా గరిష్ట ధర 100 కోట్లు దాటేసింది. పదో నంబరు ప్లాటు కోసం APR గ్రూపు- రాజ్పుష్పా, హ్యాపీహైట్స్ పోటాపోటీగా వేలంలో పాల్గొన్నాయి. చివరికి హ్యాపీ హైట్స్ నియో పోలిస్, రాజ్పుష్పా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కలిపి.. అత్యధిక ధర కోట్ చేయడంతో వారికి కేటాయించారు.
గతంలో కోకాపేటలో 49 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను విక్రయించడం ద్వారా HMDAకు 2 వేల కోట్ల ఆదాయం వచ్చింది. అప్పుడు అతి తక్కువగా ఎకరానికి 31 కోట్లు.. అత్యధికంగా 60 కోట్ల రూపాయల ధర పలికింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ పలికి ఏకంగా ఎకరం ధర 72 కోట్లు పలికేలా డిమాండ్ పెరిగింది. దీంతో ప్రభుత్వం భారీ ఆదాయం రానుంది. సుమారు 2000-2500 కోట్ల ఆదాయం వస్తుందని HMDA ఆశిస్తోంది.
కోకాపేట నియో పోలిస్ భూముల్లో అటు రెసిరెన్షియల్, ఇటు కమర్షియల్.. ఇలా మల్టీపర్పస్ నిర్మాణాలు చేసుకునేందుకు అవకాశం ఉండడంతో.. భారీగా డిమాండ్ పెరిగిపోయింది. డిమాండ్ను బట్టి ఆ ప్రాంతంలో భారీ నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు కూడా ఇవ్వనుంది. కోకాపేట నియో పోలిస్ లేఅవుట్.. అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎయిర్పోర్ట్తోపాటు మెయిన్ సిటీకి దగ్గరలో ఉండటంతోనే.. ఇంతగా డిమాండ్ పెరిగినట్టు విశ్లేషకులు వివరిస్తున్నారు.
ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు ఎకరాకు 100 కోట్లకు పైగా ధర పలకడం.. తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి అద్దం పడుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు పోటీపడి భారీమొత్తంలో ధర చెల్లించి భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలోనే కాకుండా.. ప్రగతి కోణంలోనూ చూడాలని చెప్పారు. భూములకు పెరుగుతున్న క్రేజ్.. హైదరాబాద్ నగరాభివృద్ధిలో వర్తమాన పరిస్థితికి దర్పణం పడుతోందన్నారు. తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగం అవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని కించపరిచిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా అభివర్ణించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE