తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమరం మళ్లీ మొదలవ్వబోతోంది. ఒకటి, రెండు కాదు.. మూడు ఎన్నికలు వరుసగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం కొలువై ఇంకా నెల రోజులు కూడా కాకముందే.. త్వరలోనే వరుస ఎన్నికలకు పార్టీలు సిద్ధం అవుతున్నాయి. కొత్త సంవత్సరం ప్రథమార్థంలోగా మరో మూడు ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో ఒకటి సాధారణ ఓటర్లందరూ ఓట్లేసే ఎన్నికలు కాగా, మిగతా రెండు పట్టభద్రులు, శాసనసభ్యులకు సంబంధించినవి.
దేశంలోనే కీలకమైన లోక్సభ ఎన్నికలకు ఇప్పటికే ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. రాజకీయ పార్టీలు కూడా వ్యూహ రచనలో మునిగి ఉన్నాయిఆ ఎన్నికల్లో ఎలాగైనా ఎక్కువ స్థానాల్లో గెలిచి తమ సత్తా చాటాలని ప్రధాన రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల్లో బీజేపీ, బీఆర్ఎస్ వీటిపై ఎక్కువ ఫోకస్ పెట్టాయి. బహుశా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కాబోలు లోక్సభ ఎన్నికల్లోనైనా తమ బలాన్ని చాటేందుకు అవి వ్యూహాత్మక చర్యలకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దిశానిర్దేశంతో కొత్త సంవత్సరంలో జనవరి 3 నుంచి 21వ తేదీ వరకు ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన వ్యూహం, తదితరమైన వాటిపై పార్టీ నేతలకు కేటీఆర్, కేశవరావు, మధుసూదనాచారి, హరీశ్రావు, కడియం శ్రీహరి, నిరంజన్రెడ్డి తదితరులు సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
మూడోసారి కేంద్రంలో సాధించే దిశగా భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణపై కూడా ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 30 సీట్లు గెలుస్తామని ఆ పార్టీ భావించింది. అయితే, కేవలం 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇందుకు కారణం పార్టీ నాయకుల మధ్య విభేదాలేనని భావించిన అధిష్ఠానం ఇటీవల వచ్చిన అమిత్ షా ద్వారా ముగ్గురు అగ్రనేతలకు క్లాస్ పీకించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎంతోకాలంగా ఎడమొహం పెడ మొహంగా ఉన్న బండి సంజయ్, ఈటల రాజేందర్ ఒకే వాహనంలో పార్టీ నిర్వహించిన సభకు కలిసి వెళ్లారు. గెలుపే లక్ష్యంగా తొలుత నేతలను సమన్వయపరిచే చర్యల్ని బీజేపీ చేట్టింది. పార్టీ కేడర్ లో కూడా ఉత్సాహం నింపేందుకు వరుస కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 22న అయోధ్యలో రాముడి విగ్రహం ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా రాష్ట్రంలోనూ ప్రత్యేక కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఇక అధికార పార్టీ కాంగ్రెస్ ప్రజల కిచ్చిన గ్యారంటీల అమలు తదితర చర్యల్లో ప్రస్తుతం బిజీగా ఉంది. మరోవైపు గత ప్రభుత్వం చేసిన నిర్వాకాలను ప్రజలకు వెల్లడించే పనుల్లో ఉంది. ఎర్రకోటపైనే జెండా ఎగరవేయాలని భావిస్తున్న కాంగ్రెస్ త్వరలోనే తన కార్యాచరణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ సీట్ల కోసం తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో అసెంబ్లీ వ్యూహాన్నే అనుసరించాలని భావిస్తోంది. సంక్షేమ కార్యక్రమాలను కొలిక్కి తేవడంతో పాటు, లోక్ సభ ఎన్నికలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ ఫోకస్ పెట్టారు.
లోక్సభ ఎన్నికలతో పాటు వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక జరగనుంది. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్యయాదవ్ల పదవీ కాలం మార్చిలో ముగియనుంది. దీంతో ఈ మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో ఎమ్మెల్సీ ఎన్నికకు పట్టభద్రులు ఓటర్లు కాగా,రాజ్యసభ ఎన్నికలకు ఎమ్మెల్యేలు ఓటర్లు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం ప్రథమార్ధం అంతా ఎన్నికల హడావిడితో రాజకీయ సందడి సంతరించుకోనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE