తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గురువారం నాడు రాష్ట్ర పర్యాటక శాఖలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) లో నిర్వహిస్తున్న ప్రాజెక్టులపై సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అత్యంత విలువైన మరియు వ్యూహాత్మక ప్రభుత్వ భూములను పర్యాటక సౌకర్యాలను కల్పించి దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి గత ప్రభుత్వాలు, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో (పీపీపీ) పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయుటకు భూములను వివిధ సంస్థలకు కేటాయించడం జరిగిందని చెప్పారు. అందులో భాగంగా హైదారాబాద్ నగరంలో ఐ-మాక్స్ థియేటర్ (నేక్లెస్ రోడ్), ఎక్స్ పోటెల్ హోటల్ (లోయర్ ట్యాంక్ బండ్), ట్రైడెంట్ హోటల్ (మాదాపూర్), దసపల్లా హోటల్ (జూబ్లీహిల్స్), జలవిహార్ (నేక్లెస్ రోడ్), షామీర్ పెట్ లోని గోల్ఫ్ కోర్స్ లను ప్రభుత్వ భూముల్లో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.
ఈ భూములను గత ప్రభుత్వాలు లీజుకు ఇచ్చే సమయంలో ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనల ప్రకారం వార్షిక లీజు మరియు రెవెన్యూ షేర్ ను నిర్ధారించింది. నిర్ధారించిన భూములు పొందిన కొన్ని సంస్థలు, వ్యక్తులు ప్రాజెక్టులను అభివృద్ధి చేసి వాటిని విజయవంతంగా నడిపిస్తున్నారు, కాని కొన్ని సంస్థలు చిన్న చిన్న కారణాల తో న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రాజెక్టులను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని చెప్పారు. పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేసిన వారు ప్రభుత్వానికి నిర్దేశించిన వార్షిక లీజు మరియు రెవెన్యూ షేర్ (ఏడీపీ) ను కట్టకుండా వివిధ కారణాల చేత న్యాయస్థానాలను ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకొని ప్రభుత్వ భూములలో కొనసాగుతూ, ప్రాజెక్టులని నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయలను ఆదాయం గండి పడుతున్నదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులతో ఆయా ప్రాజెక్టులపై సుదీర్ఘంగా సమీక్షించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వానికి కట్టవలసిన లీజులు, రెవెన్యూ షేర్ (ఏడిపి) ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లీజు అగ్రిమెంట్ నియమ నిబంధనల ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లీజ్ డబ్బులు కట్టడానికి సహేతు కారణాలు లేని లీజ్ ఎగవేతదారుల సంస్థలకు వెంటనే చట్ట ప్రకారం చర్యలతో పాటు వివిధ ప్రభుత్వ సర్వీసుల శాఖలైనా విద్యుత్ పంపిణీ సంస్థలు, మంచినీటి సరఫరా చేసే సంస్థలకు వెంటనే విద్యుత్ సరఫరా, నీటి సరఫరా నిలుపుదలపై అధికారులు లేఖలు రాయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో భాగంగా ఏ సంస్థల నుండి ఎంత డబ్బు ప్రభుత్వానికి బాకీ ఉందనే విషయంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు టూరిజం అధికారులు వివరించారు. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్-27. 45 కోట్లు, జలవిహార్-6.51 కోట్లు, స్నో వరల్డ్-15.01 కోట్లు, ఎక్స్ పో టెల్ హోటల్-15.13 కోట్లు, దసపల్ల హోటల్-5.67 కోట్లు, ప్రజయ్ ఇండియా సిండికేట్ (గోల్ఫ్ కోర్స్, శామీర్ పేట్)-5.58 కోట్లు, ట్రైడెంట్ హోటల్-75.05 కోట్లు రూపాయలు బకాయిలు ఉన్నాయన్నారు
ఈ సంస్థల బకాయిలు వెంటనే వసూలు చేపట్టాలని, అందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ టూరిజం అధికారులను ఆదేశించారు. పై అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెల్లి వారి అధేశాల మేరకు లీజు యజమానులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో టూరిజం ఎండీ మనోహర్, టూరిజం శాఖ జాయింట్ సెక్రటరీ కరోల్ రమేష్, శంకర్ రెడ్డి, లీగల్ అధికారులు, ఓఎస్డీ సత్యనారాయణ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF