కాంగ్రెస్ అగ్రనేతలలో ఒకరైన ప్రియాంక గాంధీ వాద్రా వచ్చే నెలలో హైదరాబాద్లో పాల్గొనే ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్చౌక్ నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు జరిగిన నిరసన ర్యాలీ అనంతరం అంబేడ్కర్ చౌక్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మే మొదటి వారంలో ప్రియాంక గాంధీ హైదరాబాద్కు రానున్నారని, ఆమె సరూర్నగర్ గ్రౌండ్ లో నిర్వహించే నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొంటారని వెల్లడించారు. అయితే దీనికిముందు రేపు నల్గొండ జిల్లా, 30న పాలమూరు జిల్లాలలో నిరుద్యోగ నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలో రాష్ట్రంలో మొత్తం లక్షా 7వేల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారని, అలాగే బిశ్వాల్ కమిటీ నివేదికలో లక్షా 91 వేల 700 ఉద్యోగాలు ఉన్నట్లు పేర్కొన్నారని, అయితే ఇప్పటివరకు నియామకాలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్కరికి రూ.1 లక్షా 60 వేల నిరుద్యోగ భృతిని చెల్లించేంత వరకు పోరాటం చేస్తామని, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన నిరుద్యోగులందరికీ న్యాయం జరిగేవరకూ పోరు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈసారి తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. తాము అధికారంలోకి రాగానే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని చెప్పారు. ఆదివాసీలు, లంబాడీలు ఉన్నత చదువులు చదువుకునేందుకు గిరిజన యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని, అలాగే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఎంతో మంది నిరుద్యోగులు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు.
కాగా ముస్లింలకు 4 శాతం మేర రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, అయితే దీనిని 12 శాతానికి పెంచుతామని సీఎం కేసీఆర్ చెప్పి తొమ్మిదేళ్లు గడిచినా అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. మరోవైపు బీజేపీ అగ్రనేత అమి త్ షా ఇటీవల చేవెళ్ల పర్యటన సందర్భంగా ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తామని ప్రకటించారని గుర్తుచేసిన ఆయన, కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి ప్రకటనలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాజకీయ జీవితాన్నిచ్చిన కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్తున్న నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ.. పార్టీని విడిచి వెళ్లిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, గడ్డం వినోద్, సిరిసిల్ల రాజయ్య, సీనియర్ నేతలు మల్లు రవి, సి.రాంచంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, టీపీసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE