తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో చేపట్టిన మార్పులు అధికారుల విచక్షణాధికారాలను తొలగించడంతో పాటు మరింత పారదర్శకత, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్ల పై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నాడు ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్ల ప్రక్రియపై నిర్వహించిన వర్క్ షాప్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు హోం మంత్రి మహ్మద్ మహ్మూద్ అలీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లతో పాటు పలువురు సీనియర్ అధికారులు, క్రెడాయ్, క్రీడా, బిల్డర్స్ ఫోరం, పలు రియల్ ఎస్టేట్ రంగాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, పౌర సేవలను మరింత మెరుగైన రీతిలో అందించేందుకు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ రిజిస్టేషన్ల రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లలో దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా విప్లవాత్మక మార్పులు: సీఎస్
రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల రంగంలో దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా దేశంలోనే తొలిసారిగా విప్లవాత్మక మార్పులను చేపట్టామని చీఫ్ సెక్రటరి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రిజిస్టేషన్ల విధానాన్ని సరళతరం చేయడం, యూజర్ ఫ్రెండ్లీ, అవినీతి రహితంగా నియమిత కాలంలో రిజిస్టేషన్, మ్యుటేషన్లను అందించాలన్నదే ఈ నూతన విధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో అక్రమాలను అరికట్టి మరింత నాణ్యతాయుత సేవలను అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. ఈ విధానం వల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తమ ఆస్తుల విలువలను లెక్కించడం, చెల్లించాల్సిన సుంకాలను తామే సులభంగా తెలుసుకునే వెసులుబాటు ఉన్నందున ప్రజల నుండి పెద్ద ఎత్తున సానుకూల స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.
ఐ.టి రంగంలో అత్యుత్తమ విధానాలను అనుసరించడం ద్వారా డిజిటలైజ్ చేసిన సమాచారం, చిత్రాలను సురక్షితంగా ఉంచేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు చేపట్టిందని వెల్లడించారు. గత నాలుగు నెలలుగా తమ అధికారులు, సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ చేసిన నిర్విరామ కృషిని సీఎస్ ప్రశంసించారు. ఈ రంగంలో మరింత మెరుగుదలకు ఏదైన సలహాలు, సూచనలు అందితే వాటిని విశ్లేషించి యుద్ధప్రాతిపదికన అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టి-పిన్ ల కేటాయించే సర్వీసులపై ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర సందేహాలపై రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై చీఫ్ సెక్రటరితో పాటు సంబంధిత సీనియర్ అధికారులు చేసిన సందేహ నివృత్తి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
రిజిస్టేషన్లు, మ్యుటేషన్ల విధానంలో ప్రభుత్వం రూపొందించిన ఈ మార్పుల వల్ల రియాల్టీ రంగ వ్యాపారం మరింత సులభతరం అవుతుందని ఈ వర్క్ షాపుకు హాజరైన పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యుత్తమమైన ఈ విధానానికి తమ పూర్తి స్థాయి మద్దతును అందజేస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందడంతోపాటు రాబోయే రోజుల్లో రాష్ట్ర జిడిపి, ఉపాధి కల్పన రంగాల్లో గణనీయమైన వృద్ధి ఉంటుందని పేర్కొన్నారు. ఈ వర్క్ షాప్ లో రిజిస్ట్రేషన్లు, స్టాంప్ ల శాఖ కమిషనర్, ఇన్ స్పెక్టర్ జనరల్ శేషాద్రి, షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయతి రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్ రావు, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణ, జిహెచ్ఎంసి, రిజిస్ట్రేషన్లు, స్టాంప్ లు, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ