రామ జన్మ భూమి అయిన అయోధ్య పురిలో వచ్చే సంవత్సరం జనవరిలో శ్రీ రాముని ఆలయాన్ని తెరవనున్నారు. ఆలయంలో రాంలాల పట్టాభిషేక కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా శ్రీరామ మందిర నిర్మాణానికి చేసిన ఖర్చుకు సంబంధించి రామమందిర్ ట్రస్ట్ సభ్యులు సమాచారం అందించారు. అంతేకాదు ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి శ్రీరామ జన్మభూమి తీర్థం పరిధిలో ట్రస్టు సభ్యులతో ప్రధానంగా చర్చ జరిగింది. సుమారు 3 గంటలకు పైగా కొనసాగిన సమావేశంలో రాంలాలా దీక్షకు సంబంధించిన ఏర్పాట్లపైన కూడా చర్చించారు.
విదేశీ కరెన్సీలో కూడా విరాళాలను స్వీకరించడానికి చట్టపరమైన ప్రక్రియ గురించి సభ్యులకు వివరించారు. అలాగే మరోవైపు అక్టోబర్ 9 నుంచి సరయూ నది ఒడ్డున గల రామ్ కథా మ్యూజియం చట్టబద్ధంగా రామమందిరం ట్రస్ట్ నిర్వహణలోకి వచ్చేసింది. రామాలయానికి సంబంధించి 500 ఏళ్ల చరిత్ర.. 50 ఏళ్ల చట్టపరమైన పత్రాలను పరిరక్షించడం రామ కథా మ్యూజియం యొక్క ప్రధాన లక్ష్యంగా ట్రస్టు సభ్యులు చెబుతున్నారు.
2020 నుంచి 2023 మార్చి 31 వరకు అయోధ్య రామమందిర నిర్మాణ పనులతో పాటు మందిర సంబంధిత పనుల కోసం మొత్తం రూ.900 కోట్లు ఖర్చు చేసినట్లు రామమందిర్ ట్రస్ట్ సభ్యులు చెప్పారు. అంతేకాదు రాముడికి సంబంధించిన ఖాతాలలో రూ. 3000 కోట్ల కంటే ఎక్కువ మొత్తం మిగిలి ఉన్నట్లు వెల్లడించారు. రాముని ఆలయానికి రోజువారీ నైవేద్యాల కోసం అలాగే ముఖ్యంగా రాంలాలా ఆలయ నిర్మాణంతో పాటు ఆలయ సంబంధిత పనులకు ఈ డబ్బులు ఉపయోగిస్తున్నారు.
అంతేకాదు రాంలాలా పవిత్రీకరణ, దేవుడిని ఆరాధించే పద్ధతికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో భగవంతుడిని పవిత్రం చేయడం, దేవుడిని అలంకరించడం, బట్టలు ధరించడం, పూజించడం వంటి కార్యక్రమాలలో కమిటీ సలహాలు, సూచనలు ఇవ్వనుంది. దీంతో పాటు రామనంది సంప్రదాయంలో అయోధ్యలో దేవుడిని పూజిస్తామని ట్రస్టు సభ్యులు చెప్పారు. దీంతో రాంలాలా పూజలూ రామనంది సంప్రదాయం ప్రకారమే జరుగుతాయి. అటు రాంలాలా ఆలయ నిర్మాణ పనులు మూడు దశల్లో జరుగుతుండగా..రాంలాలా గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం డిసెంబర్ 2023కి పూర్తవుతుంది. అలాగే డిసెంబరు 2025 నాటికి రాంలాలా ఆలయం పూర్తిగా సిద్ధంగా ఉంటుంది.
బిర్లా ధర్మశాల ఎదురుగా ఉన్న పాత బస్టాండ్ స్థలంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఒక కేంద్రాన్ని నిర్మించనున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా రాంలాలా ప్రాణ ప్రతిష్ట పండుగను జరుపుకోవడానికి రాంలాలా ముందు.. అక్షత పూజ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.దీనికోసం దేశవ్యాప్తంగా అక్షతల పూజ చేసే విధంగా.. దేశవ్యాప్తంగా అక్షతలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వహిందూ పరిషత్కు చెందిన కార్యకర్తలు అక్షతలను ప్రజలకు క్రమపద్ధతిలో పంపిణీ చేస్తారు.