ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్, ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి సొంత చెల్లి షర్మిల జగన్ లక్ష్యంగా విమర్శల బాణాలు విసురుతున్నారు. ఆయన రాజకీయ పరపతిని తగ్గించడమే పనిగా పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. జగన్ మాత్రం దేనికీ చలించకుండా సింహం సింగిల్గానే అన్నట్లు తనదైన శైలిలో సిద్ధం అంటూ దూసుకెళ్తున్నారు. ఇప్పుడు తాజాగా మరొకరు జగన్ ను ఢీకొట్టేందుకు సిద్ధం అవుతున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి జగన్ పై పోటీచేయనున్నట్లు ప్రకటించారు.
ఎన్నడూలేని రీతిగా ఈసారి ఏపీ రాజకీయాలు హాట్హాట్గా మారాయి. గతంలో బయట నుంచి టీడీపీకి మద్దతు ఇచ్చి గెలిపించిన పవన్.. ఈసారి ఆపార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఉమ్మడి జాబితా కూడా విడుదల చేశారు. తాజాగా టీడీపీ. జనసేన పార్టీలు ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాయి. సభలో ఇరుపార్టీల కార్యకర్తలు కదం తొక్కారు. టీడీపీ తమ్ముళ్లు, జనసైనికుల ఉత్సాహంతో సభాప్రాంగణం వద్ద కోలాహలంగా మారింది. భారీగా వచ్చిన టీడీపీ, జనసేన కార్యకర్తలు తరలిరావడంతో సభ గ్రాండ్ సక్సెస్ అయినట్లు రెండు పార్టీలూ భావిస్తున్నాయి. సభకు వచ్చిన మద్దతుతో గెలుపుపై ఆశలు మరింగ చిగురించినట్లుగా ఇరు పార్టీల శిబిరాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇవన్నీ నిశితంగా గమనిస్తున్న వైసీపీ శ్రేణులు కూడా పైఎత్తులకు సిద్దమవుతున్నాయి. ఇంతలో దస్తగిరి లాంటి వ్యక్తులు తెరపైకి వచ్చి ఆసక్తికర చర్చలు రేపుతున్నారు.
పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై పోటీ చేస్తానని వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి వెల్లడించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టు విచారణకు హాజరైన అనంతరం.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. ‘‘వైసీపీ నేతలు ఎంపీ అవినాశ్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి నన్ను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ నన్ను కొట్టి అప్రూవర్ గా మార్చినట్టు చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి…రామ్ సింగ్ పై ఎలాంటి ఆరోపణలు చేశారో, నేనూ అలాగే చేయాలని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. డబ్బు ఆఫర్ చేశారు’’ అని తెలిపారు.
కిడ్నాప్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సమయంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి డాక్టర్ ముసుగులో జైలు లోపలకు వచ్చారని, రూ. 20 కోట్లు అడ్వాన్స్ కింద తీసుకోవాలని ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని, తెలంగాణ పోలీసులతో భద్రత కల్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే విషయమై కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. ‘‘నాకు 2 + 2 గన్మెన్ ఉన్నప్పుడు నేను ఎలా కిడ్నాప్ చేస్తాను? నాకు ఎస్కార్ట్ వెహికల్ కూడా ఉంది. కక్షపూరితంగానే నాపైన కిడ్నాప్ కేసు పెట్టి జైలుకు పంపించారు’’ అని తెలిపారు. కాగా, వివేకా హత్య కేసులో తాను అప్రూవర్ గా మారినందున, తనని నిందితుడుగా కాకుండా సాక్షిగా పరిగణనలోకి తీసుకోవాలంటూ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇదిలాఉంగానే.. దస్తగిరి రాజకీయరంగ ప్రవేశం గురించి చెప్పడంతో జగన్పై మరో కొత్త ఎత్తుగడ పన్నుతున్నట్లు వైసీపీ భావిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ