ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 8, మంగళవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణ చర్యలు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ, నాడు-నేడు పనులు, అంగన్ వాడీ భవనాల ఏర్పాటు, ఎరువుల లభ్యత తదితర అంశాలపై సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అక్టోబర్ 2, గాంధీ జయంతి రోజున 35 షెడ్యూల్డ్ మండలాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. అందులో భాగంగా లబ్ధిదారులకు కేటాయించిన భూమి వద్ద వారి పోటోలు తీయడం, ఆర్ఓఎఫ్ఆర్ డేటాబేస్ వివరాలను నమోదు చేయడంతో పాటుగా సంబంధిత పక్రియనంతా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కరోనా నిబంధనలకు అనుగుణంగా అక్టోబర్ 5న స్కూల్స్ తెరిచే అవకాశం ఉందని, సెప్టెంబర్ 30వ తేదీలోగా పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అదేవిధంగా ఎరువుల లభ్యతపై కలెక్టర్లు వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరానికి తగట్టు తగిన సమయంలో ఎరువులు అందేలా చూడాలని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో మొత్తం 22979 అంగన్ వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, వాటికోసం నూతన భవనాలను నిర్మించాలన్నారు. 11,961 చోట్ల అంగన్ వాడీల కోసం స్థలం గుర్తించారని, ఇక మిగిలిన 12,018 చోట్ల స్థలాలను త్వరగా గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu