ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్ వద్ద పౌరసరఫరాల శాఖకు సంబంధించి రేషన్ డోర్ డెలివరీ నూతన వాహనాలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,260 వాహనాల ద్వారా ఫిబ్రవరి 1 నుండి ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం, రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేసి ప్రజా పంపిణీ వ్యవస్థలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.830 కోట్లు అదనంగా ఖర్చు చేయనుంది. ఈ నేపథ్యంలో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఈ రోజు సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను మంత్రులు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు నాణ్యమైన బియాన్ని ఇంటివద్దే పంపిణీ చేస్తారు. మొబైల్ ఆపరేటర్ (వాహనదారుడు) రోజూ ఉదయం బియ్యంతో పాటు ఈ–పాస్ యంత్రాన్ని రేషన్ డీలర్ నుంచి తీసుకోవాలి. ఆఖరులో మిగిలిన స్టాకుతో పాటు ఈ–పాస్ యంత్రాన్ని తిరిగి డీలర్కు అప్పగించాలి. ఆపరేటర్ రోజూ ఈ–పాస్ మిషన్లో తన హాజరును నమోదు చేసుకోవాలి. ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీపై ఈ నెల 22, 23 తేదీల్లో మొబైల్ ఆపరేటర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. వాహనం వినియోగం, తూకం యంత్రం, డోర్ డెలివరీ తదితరాలపై అవగాహన కల్పిస్తారు. ఈ నెల 24 నుంచి 29 వరకు వాహన ఆపరేటర్లు, నోడల్ వీఆర్వోలు ట్రయల్ రన్ నిర్వహించాలని ఆదేశించారు. క్లస్టర్ పరిధిలోని రేషన్ డీలర్లు, వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని కలిసి పరిచయం చేసుకోవాలి.
నిరుద్యోగ యువతకు ఉపాధి:
బియ్యం, నిత్యావసర సరుకులను కార్డుదారులకు ఇంటివద్దే అందించేందుకు 9,260 మొబైల్ వాహనాలను రివర్స్ టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించేందుకు ఈ వాహనాలను వివిధ కార్పొరేషన్ల ద్వారా 60 శాతం సబ్సిడీతో సమకూర్చింది. ఒక్కో వాహనం విలువ రూ.5,81,000 కాగా రూ.3,48,600 సబ్సిడీగా అందించింది. ఈ వాహనాలకు పౌరసరఫరాల సంస్ధ ప్రతి నెలా అద్దె చెల్లిస్తూ ఆరేళ్ల పాటు వినియోగించుకోనుంది. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 700, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2,300, బీసీ కార్పొరేషన్ ద్వారా 3,800, మైనారిటీస్ కార్పొరేషన్ ద్వారా 660, ఈబీ కార్పొరేషన్ ద్వారా 1,800 వాహనాలను అందించారు.
రేషన్ సరుకుల్లో కొత్త విధానం:
కార్డుదారులకు ఇంటి వద్దే రేషన్ సరుకుల పంపిణీ జరగడం వల్ల కూలీ పనులకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కార్డుదారుల సమక్షంలోనే సంచులు తెరిచి కచ్చితమైన ఎలక్ట్రానిక్ తూకంతో పంపిణీ చేస్తారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దే కార్డుదారుల వేలిముద్ర తీసుకుని నాణ్యమైన, కచ్చితమైన తూకం కలిగిన బియ్యాన్ని తిరిగి వినియోగించే సంచుల ద్వారా పంపిణీ చేయనున్నారు. మొదటిసారి ఈ సంచులను ఉచితంగా ఇవ్వనున్నారు. కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతి బియ్యం బస్తాకూ సీల్ ఉంటుంది, ప్రతి సంచికీ యూనిక్ కోడ్ వల్ల ఆన్లైన్ ట్రాకింగ్ జరుగుతుంది. అన్ని మొబైల్ వాహనాలకు జీపీఎస్ అమర్చడం వల్ల కార్డుదారులు మొబైల్ యాప్ ద్వారా పంపిణీ వివరాలు రియల్ టైంలో తెలుసుకోవచ్చు. మొబైల్ వాహనం నెలకు సగటున 18 రోజుల పాటు కార్డుదారుల సౌకర్యార్ధం సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ సగటున 90 కార్డులకు తగ్గకుండా పంపిణీ చేయాలి. దీనిపై నిరంతరం సోషల్ ఆడిట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ తూకం ద్వారా కచ్ఛితమైన తూకంతో సరుకుల పంపిణీ చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ