ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనికి సంబంధించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 లోగోను ఆవిష్కరించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ ఆర్. కరికాల వలవెన్, పరిశ్రమల శాఖ సలహాదారు శ్రీధర్, మారిటైం బోర్డు సీఈఓ షన్ మోహన్, ఏపీఐడీసీ డైరెక్టర్లు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇక ఈ సందర్భంగా సీఎం జగన్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అమర్నాథ్ సహా అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి గల అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని, అలాగే తదనుగుణంగా వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాలని సూచించారు. దేశంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంక్లో ఏపీ ముందువరుసలో ఉందని గుర్తు చేశారు. అలాగే ఐటీ, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పవర్, టూరిజం, టెక్స్టైల్స్ రంగాల పెట్టుబడి అవకాశాలపై దృష్టి సారించాలని సీఎం జగన్ పేర్కొన్నారు.
అనంతరం మంత్రి అమర్నాథ్ వివరాలను మీడియాకు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023ను నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. గత మూడేళ్ళుగా కోవిడ్ మహమ్మారి, అనంతర పరిస్థితుల కారణంగా ఇలాంటి సమ్మిట్స్ నిర్వహించలేకపోయామని, ఈసారి భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నామని తెలియజేశారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఏపీ కీలక పాత్ర పోషించనుందని, దేశానికి ఏపీని గేట్ వే గా మారుస్తామని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE