ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 9న చిత్తూరు జిల్లాలో ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రారంభించనున్నారు. అమ్మ ఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల తుది జాబితా సిద్ధమైంది. రాష్ట్రంలో పిల్లలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లికి ఈ పథకం కింద ప్రతి సంవత్సరం ఆర్థిక సాయంగా రూ.15వేలు బ్యాంకు అకౌంట్లో జమ చేయనున్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులతో పాటుగా ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. అలాగే ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలతో సంబంధం లేకుండా కనీసం 75శాతం హాజరుకలిగిన ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
అమ్మ ఒడి పథకం కోసం వివిధ శాఖల నుంచి రూ.6,109 కోట్ల నిధుల విడుదల చేసేందుకు ప్రభుత్వం పాలనా అనుమతులను మంజూరు చేసింది. నిధుల సమీకరణలో భాగంగా బీసీ కార్పోరేషన్ నుంచి రూ.3,432 కోట్లు, ఎస్సీ కార్పోరేషన్ నుంచి రూ.1,271 కోట్లు, కాపు కార్పోరేషన్ నుంచి రూ.568 కోట్లు, మైనారిటీ సంక్షేమశాఖ నుంచి రూ.442 కోట్లు మరియు గిరిజనశాఖ ఎస్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ నుంచి రూ.395 కోట్లు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది.
[subscribe]