ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సరైన పరిస్థితులు లేవని, ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని లేఖలో ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే 6,890 మంది కరోనాతో మరణించారని, వచ్చే రోజుల్లో కరోనా ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని కేంద్రం కూడా తెలిపిందని ఆమె పేర్కొన్నారు. కరోనాపై పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయని, ఈ విషయంలో ఒక రాష్ట్రాన్ని మరో రాష్ట్రంతో పోల్చిచూడడం సరికాదని అన్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా వ్యాప్తి ఉందని చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రజల ఆరోగ్యం, ఇతర భద్రత కారణాల దృష్ట్యా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామనడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని అన్నారు. అలాగే అధికార యంత్రాంగమంతా కరోనా విధుల్లో ఉన్న ప్రస్తుత సమయంలో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని సీఎస్ నీలం సాహ్ని లేఖలో పేర్కొన్నారు.
ముందుగా మంగళవారం నాడు స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ కీలక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిందని, రోజువారీగా నమోదయ్యే కేసుల సంఖ్య కూడా తగ్గిన క్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తునట్టు తెలిపారు. ఈ ఎన్నికలకు న్యాయపరంగా కూడా ఇబ్బందులు లేవని అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు, సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అంశంపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని సీఎస్ నీలం సాహ్ని లేఖ ద్వారా ఎస్ఈసీ రమేష్ కుమార్ కు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ