దేశవ్యాప్తంగా సోమవారం రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్-1లో పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ కూడా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే తన మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఓటు వేశారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
అయితే పోలింగ్ ప్రారంభమైన తర్వాత ముందుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినిగించుకున్నారు. కాగా ఏపీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అత్యధికంగా అధికార వైసీపీకి 151 మంది ఉన్నారు. ఆ తరువాత టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు, జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అలాగే రాష్ట్రంలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలుండగా.. వైసీపీకి 22 మంది, టీడీపీ ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఇక రాజ్యసభ స్థానాలు 11 ఉండగా వైసీపీ ఎంపీలు 9 మంది, టీడీపీ, బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా దాదాపు 4,800 మంది ఎన్నికైన ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు సోమవారం భారత 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఓటు వేస్తున్నారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు పోటీగా ప్రతిపక్షాల తరపున యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. అయితే ముర్మూకు అనుకూలంగా దాదాపు 60 శాతానికి పైగా ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ