ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్య సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో గుర్తించబడిన అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలోకి ఉచిత ప్రవేశాలు కల్పించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ పాఠశాలల్లో 25 శాతం సీట్లను రిజర్వ్ చేయాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ఆర్టీఈ చట్టం ప్రకారం ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో 25 శాతం సీట్లు కేటాయించి అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ విధానంలో ఇప్పటికే ఎంపిక చేసిన విద్యార్థుల జాబితాపై డీఈవోల ద్వారా ఆయా పాఠశాలల యాజమాన్యాలకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించామని సురేష్ కుమార్ వెల్లడించారు.
కాగా ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఆర్టీఈ చట్టం కింద ఉచిత విద్య అమలులో భాగంగా ఈ ఏడాది మార్చి 3, 2011న పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 20లోని నిబంధనలకు సవరణలు చేశారు. దీని ప్రకారం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు 5 శాతం సీట్లు, ఎస్సీ విద్యార్థులకు 10 శాతం, ఎస్టీ విద్యార్థులకు 4 శాతం సీట్లు.. అలాగే బీసీలు, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాలకు 6 శాతం సీట్లు కేటాయిస్తారు. దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం 1.2 లక్షలకు మించకూడదు మరియు పట్టణ ప్రాంతాల్లో 1.4 లక్షలకు మించకూడదు. విద్యార్థుల జాబితాను ఆన్లైన్లో cse.ap.gov.in/DSE/ అనే వెబ్సైట్ లో ఉంచారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 12 వరకు అడ్మిషన్లు జరుగనున్నాయి. అలాగే ఈ విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్ వంటివి అందించాలని ఆదేశాలు వెలువడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ