ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అవినీతి అధ్యయనంపై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు అహ్మదాబాద్ లోని ప్రముఖ విద్యాసంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)తో నవంబర్ 21, గురువారం నాడు రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. క్యాంపు కార్యాలయంలో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఐఐఎం ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, లోపాలపై వచ్చే ఫిబ్రవరి మూడోవారం వరకు ఐఐఎం అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది.
ఈ ఒప్పందం అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వివిధ విభాగాల్లో జరుగుతున్న అవినీతిని నిర్మూలించడం వలన అంతిమంగా సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ పథకాలు ఎటువంటి వివక్ష, అవినీతికి తావులేకుండా ప్రజలందరికి పారదర్శకంగా అందుతాయని తెలిపారు. గతంలో ఏ అవసరానికైనా ప్రజలు మండల కార్యాలయాల వరకు వెళ్లేవారని, కానీ తమ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల వద్దకే చేరేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను సీఎం జగన్, ఐఐఎం ప్రతినిధులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.
[subscribe]