ఆంధ్రప్రదేశ్లోని ప్రతీ సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు మంత్రి అంబటి రాంబాబు. మంగళవారం ఆయన నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం, జూపాడు బంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు గేట్ల వ్యవస్థ పనితీరు సవ్యంగానే ఉందని, అయితే నీటిలో ఉండటం వలన గేట్లు తుప్పు పట్టాయని, చిన్నపాటి మరమ్మతులు చేయిస్తే సరిపోతుందని తెలిపారు. తాను జలవనరులశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తున్నానని, ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు, బానుకచర్ల హెడ్ రెగ్యులేటర్, తెలుగు గంగ, అవుకు రిజర్వాయర్లను పరిశీలించానని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.
దీనిలో భాగంగానే ఈరోజు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుని పరిశీలించడానికి వచ్చానని, వెలిగొండ, అవుకు టన్నెల్స్ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి అంబటి వెల్లడించారు. సీఎం జగన్ ఎన్నడూ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చూపలేదని, అలాగే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లాగా ద్వంద్వ వైఖరి ప్రదర్శించలేదని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ముందుచూపు లేని చర్యల వల్లే పోలవరం ఆలస్యం అవుతోందని, సీఎం జగన్ ఆదేశాల మేరకు మరికొన్ని నెలల్లో పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుతో పాటు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, నీటిపారుదల శాఖ అధికారులు, పలువురు స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY