టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 3, గురువారం నాడు కేంద్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కి లేఖ రాసారు. ఉపాధి హామీ పధకం(ఎంజిఎన్ఆర్ఇజిఎ) పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో చొరవ చూపించాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2014-2019 మధ్య సమయంలో ఉపాధి హామీ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసి దేశం మొత్తం మీద రాష్ట్రాన్ని ప్రధమ స్థానంలో నిలిపామని లేఖలో ప్రస్తావించారు. అయితే కేంద్రం పెండింగ్ బిల్లులకు సంబంధించి రూ.1845 కోట్లు విడుదల చేసిన కూడ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, తమ వంతు వాటాను జతచేసి ఇంకా విడుదల చేయలేదని విమర్శించారు.
ఉపాధి హామీ నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవరిస్తుందని, పెండింగ్ బిల్లులను చెల్లించకుండా నిధులను మళ్లించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడుతూ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు ఉపాధి హామీ పధకం యొక్క స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. అనేక పేద కుటుంబాల జీవనోపాధిని సంబంధించిన విషయంలో తక్షణమే బిల్లుల విడుదలకు చొరవ చూపాలని కేంద్రమంత్రిని కోరారు. ఉపాధి హామీ పధకం పెండింగ్ బిల్లులకు సంబంధించి అక్టోబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కూడ చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
[subscribe]