ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు రూ.666.84 కోట్లను అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో జమ చేశారు. రెండో దశలో భాగంగా రూ.10 వేలు లోపు డిపాజిట్ దారులైన 3.86 లక్షలమందికి, రూ.20 వేల లోపు డిపాజిట్ దారులైన 3.14 లక్షల మందికి కలిపి మొత్తం 7,00,370 మంది అగ్రిగోల్డ్ బాధితులకు రూ.666.84 కోట్లను వారి ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ నేడు జమచేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ముందుగా మొదటి దశలో భాగంగా 2019 నవంబర్ లో రూ.10వేల లోపు డిపాజిట్ దారులైన 3.40 లక్షల మందికి అగ్రిగోల్డ్ బాధితులకు రూ.238.73 కోట్లు చెల్లించామని చెప్పారు. నేటి రెండో దశతో కలిపి ఇప్పటివరకు రూ.20 వేల వరకు డిపాజిట్ చేసిన మొత్తం 10.40 లక్షల మంది ఖాతాల్లో రూ.905.57 కోట్లు జమ చేసినట్లు అయిందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందని, ఈ ప్రభుత్వం బాధితులకు ఎప్పుడూ బాసటగా ఉంటుందన్నారు. ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా నష్టపోయిన బాధితులకు న్యాయం చేయడం దేశంలో ఎక్కడా లేదని, పేద ప్రజల కోసమే ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుందని సీఎం అన్నారు. కోర్టు కేసులు అనంతరం, అగ్రిగోల్డ్ వ్యవహారం పూర్తిగా కొలిక్కి రాగానే మిగిలిన డిపాజిటర్లకు డబ్బు చెల్లింపులు ఉంటాయని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. హైకోర్టు నిర్దేశించిన విధంగా మొత్తం 7 లక్షలకు పైచిలుకు అర్హులైన అగ్రిగోల్డ్ బాధితులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించి, సీఐడీ ద్వారా నిర్ధారించినట్టు ప్రభుత్వం పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ