ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నష్టాల ఊబి నుంచి గట్టెక్కించి, ఆర్టీసీని బతికించాలనే ఉద్దేశంతోనే చార్జీలను పెంచుతున్నామని, పెరిగిన ధరలు ఏ తేదీ నుంచి అమలులోకి వస్తాయో త్వరలో ప్రకటిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ఇటీవలే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెంపు అమలుకు ఏపీఎస్ఆర్టీసీ ముహూర్తం ఖరారుచేసింది. డిసెంబర్ 11, బుధవారం నుంచే పెంచిన బస్సు ఛార్జీలు అమల్లోకి వస్తాయని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. పల్లె వెలుగు మరియు సిటీ సర్వీస్ బస్సుల్లో ప్రతి కిలోమీటర్కు రూ.10 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే పల్లె వెలుగు బస్సుల్లో మొదటి రెండు స్టేజీలు లేదా 10 కిలోమీటర్ల వరకు ఛార్జీల పెంపు వర్తించదని, అలాగే సిటీ, ఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకు ఛార్జీల పెంపులేదని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. సూపర్ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో కిలోమీటర్ కు 20 పైసలు చొప్పునా, గరుడ, అమరావతి, ఇంద్ర ఏసీ బస్సుల్లో కిలోమీటర్ కు 10 పైసలు చొప్పునా పెంపును నిర్ణయించారు. వెన్నెల, ఇతర స్లీపర్ బస్సులకు ఛార్జీల పెంపును వర్తింపజేయలేదు.
డీజిల్ ధర పెరగడం వలన సంస్థపై ప్రతి సంవత్సరం రూ.630 కోట్ల అదనపు భారం పడుతుందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. అలాగే ఆర్టీసీ సిబ్బంది జీతభత్యాలు, విడి భాగాలు సమకూర్చడం వంటి అంశాలవలన మరో రూ.650 కోట్ల భారం పడుతుందని తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ యొక్క బకాయిలు రూ.6735 కోట్లు ఉన్నాయని, ఆర్టీసీకి ప్రతి సంవత్సరం రూ.1200 కోట్ల నష్టం వస్తోందని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ఆర్టీసీ ఈ విధంగా నష్టాలలోకి చేరుకుందని మంత్రి పేర్ని నాని ఇటీవల విమర్శించిన సంగతి తెలిసిందే.
[subscribe]