ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార వైఎస్సార్సీపీ ఒంటరి పోరుకు సిద్ధమవగా..టీడీపీ, జనసేన కలిసి నడుస్తున్నాయి. బీజేపీతో కూడా టీడీపీ,జనసేన పొత్తుకు సై అంటోంది. అటు కాంగ్రెస్ పార్టీ షర్మిలకు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పగ్గాలు అప్పగించి..రాబోయే ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సాధించ వ్యూహరచన చేస్తోంది. దీనికి తగినట్లే షర్మిల కూడా వైసీపీని గద్దె నుంచి దింపడానికి బీజేపీ, టీడీపీలకు కలిసి నడుద్దామంటూ లేఖ కూడా రాసింది. మరోవైపు వామపక్షాలు కూడా కాంగ్రెస్ పార్టీతో జత కట్టడానికి సిద్ధం అవుతున్నాయి. మొత్తంగా ఏపీలో రాజకీయ స్వరూపం మారనుండటంతో.. గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ..అటు నేషనల్ మీడియా సంస్థలతో పాటు..సర్వే ఏజెన్సీలు కూడా రంగంలోకి దిగాయి. ప్రజాభిప్రాయాన్ని ఒడిసిపట్టే ప్రయత్నం కోసం ఇప్పటికే తమ సర్వేలను కొనసాగిస్తున్నాయి. దీనిలో భాగంగా.. ఇండియా టుడే ఛానల్ మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో సీ ఓటర్ సంస్థతో కలిసి తాజాగా విడుదల చేసిన సర్వే రాజకీయాలలో వేడిని పుట్టిస్తోంది. ఇందులో వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి, కాంగ్రెస్, బీజేపీలను నాలుగు పార్టీలను విభజించి సర్వే చేసింది. అయితే ఇండియా టుడే ఫలితాలు ఇప్పటి వరకు వచ్చిన సర్వేలకు భిన్నంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాలలో ఈ ఫలితాలు ఇష్యూ హాట్ టాపిక్ అయింది.
లోక్ సభ స్థానాల ప్రాతిపదికన ఇండియా టుడే సర్వే చేసినట్లు తెలుస్తోంది. 25 పార్లమెంట్ స్థానాలలో.. టీడీపీ-జనసేన కూటమి 17 స్థానాలతో ముందంజలో ఉండగా..వైసీపీ మాత్రం 8 పార్లమెంట్ స్థానాలకు పరిమితం అయింది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 22 స్థానాలు దక్కించుకోగా.. ఈ సారి జరగబోయే ఎన్నికల్లో మాత్రం 14 ఎంపీ స్థానాలు చేజార్చుకోనుందని తేలింది. టీడీపీ-జనసేన కూటమికి 45 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు సర్వేలో తెలుస్తోంది. వైసీపీ కూడా 41% ఓట్లు దక్కించుకుంటుందని ఇండియా టుడే సర్వే తేల్చింది. కాంగ్రెస్ 2.7% ఓట్లను, బీజేపీ 2.1 శాతం ఓట్లను దక్కించుకుంటాయని ఈ సర్వే చెబుతోంది.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ లెక్కన టీడీపీ-జనసేన కూటమికి 119 స్థానాలు, వైసీపీకి 56 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలుతోంది. అయితే బీజేపీ కూడా పొత్తుకు సై అంటున్నా.. తాజాగా చేపట్టిన సర్వే మాత్రం టీడీపీ – జనసేన వరకే కూటమిగా పరిగణనలోకి తీసుకుని సర్వే చేపట్టింది. ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీలకు బీజేపీ కూడా తోడైతే ఈ కూటమికి మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా రిలీజయిన సర్వే టీడీపీ, జనసేనలో జోష్ నింపగా.. వైసీపీలో మాత్రం టెన్షన్ పుట్టిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE