రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముగిసింది. పదేళ్లుగా ఆ పార్టీకి అధ్యక్షుడు మినహా కేడర్ లేదు. కాంగ్రెస్ నేత అని గర్వంగా చెప్పుకునే పరిస్థితీ లేదు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నిలబడేందుకు చాలా మంది వెనకడుగు వేశారు. రాష్ట్రాన్ని విభజించిన పాపానికి ఏపీలో కాంగ్రెస్ ప్రాభవం కోల్పోయింది. కర్ణాటక, తెలంగాణ ఫలితాల నేపథ్యంలో ఏపీలోనూ ఆశలు మొదలయ్యాయి. వైఎస్ ఆర్ కుమార్తె షర్మిల పార్టీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించాక పార్టీలో కదలిక మొదలైంది. ఆమె రాష్ట్రంలో పర్యటిస్తూ ముఖ్య నేతలను కలుస్తూ, కార్యకర్తల్లో పునరుత్తేజం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈసారైనా ఎలాగైనా అసెంబ్లీలో కనీస ప్రాతినిధ్యం పొందాలని అధిష్ఠానం భావిస్తోంది. ఈక్రమంలోనే షర్మిలను వెనకుండి నడిపిస్తోంది.
అధిష్ఠానం ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా వెళ్లనున్నారు. తనైదన వాక్పటిమతో, బలమైన వాక్బాణాలతో, ప్రత్యర్థులను ఎండగట్టడంలో దిట్ట అయిన ఆయన చేసిన ప్రచారం తెలంగాణలో పార్టీకి ఎంతగానో ఉపకరించిందనడం అతిశయోక్తి కాదు. త్వరలో ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేయనున్నట్లు పార్టీ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యంఠాకూర్ ప్రకటించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించారు. తన అన్న అని కూడా చూడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తీవ్రవిమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనో నియంత అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఆమెకు తోడు రేవంత్రెడ్డిని స్టార్ క్యాంపెయినర్గా వినియోగించుకుంటే పార్టీకి లాభం చేకూరనున్నట్లు పార్టీ అగ్ర నేతలు భావించారు.అందుకే ఆయన ఏపీ ప్రచారంలో పాల్గొననున్నట్లు ప్రకటించారు.
ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం ఏపీలో ఎన్నికలకు ముందు రేవంత్రెడ్డిని పార్టీ ప్రచారానికి నియమించాల్సిందిగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కోరినట్లు కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. అందుకు సోనియాగాంధీ ఓకే చెప్పినట్లు.. ఆ నేపథ్యంలోనే మాణిక్యం ఠాకూర్ రేవంత్ ప్రచారంపై తాజాగా ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే రేవంత్ ఏపీ ప్రచారానికి వెళ్లే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో విశాఖపట్నంలో నిర్వహించే భారీ బహిరంగసభకు రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు చెబుతున్నారు. ఆ సభకుకర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు పలువురు జాతీయ నేతలు కూడా హాజరు కానున్నట్లు సమాచారం. షర్మిల హైదరాబాద్లో రేవంత్రెడ్డిని కలిసినప్పుడు కూడా ఏపీలో ప్రచారం చేయాల్సిందిగా ఆహ్వానించారని, అందుకు రేవంత్రెడ్డి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ప్రచారంలో ఉంది.
ఇదిలా ఉండగా, ఏపీలో ప్రచారానికి వెళ్లే రేవంత్రెడ్డి కేవలం వైఎస్సార్సీపీౖని, వైఎస్ జగన్మోహన్రెడ్డి పైనే గురి పెడతారా? లేక తెలుగుదేశం చంద్రబాబును కూడా విమర్శిస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రేవంత్రెడ్డి రాజకీయంగా ఎదిగింది తెలుగుదేశం పార్టీ నుంచే. చంద్రబాబు రేవంత్రెడ్డికి రాజకీయ గురువు కూడా.అంతేకాదు..ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ప్రధాన పాత్రధారిగా ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ చంద్రబాబుపై రేవంత్రెడ్డి ఎలా వ్యవహరించనున్నారనేది పలువురికి ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ