అలనాటి తెలుగు అగ్రనటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) యుగ పురుషుడైతే.. నేటి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మంచి విజనరీ అని పేర్కొన్నారు సూపర్స్టార్ రజనీకాంత్. ఈ మేరకు ఆయన శుక్రవారం విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల అంకురార్పణ సభకు ముఖ్య అతిథిగా హాజరైన క్రమంలో వారితో తనకున్న అనుబంధం, అనుభవాల గురించి వివరించారు. కాగా ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారుడు, ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల నుంచి తనకు మంచి మిత్రుడని, నటుడు మోహన్బాబు ఆయనను తొలిసారి తనకు పరిచయం చేశారని తెలిపారు. చంద్రబాబు పదవిలో ఉన్నా లేకున్నా.. ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగితే అప్పుడు ఇస్తారని, ప్రతి సంవత్సరం జన్మదినం రోజున ఎక్కడున్నా సరే తనకు శుభాకాంక్షలు చెబుతుంటారని తెలిపారు.
చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలా? అని 24 గంటలూ ఒకటే ఆలోచన చేస్తుంటారని, ఇండియాలోని పెద్ద పెద్ద పొలిటీషియన్లందరికీ ఆయన గురించి తెలుసని, ఆయన టాలెంట్ ఏంటో ఇక్కడ ఉన్నవారి కంటే బయటివారికే బాగా తెలుసని రజనీకాంత్ పేర్కొన్నారు. ఆయనకు ఇండియన్ పాలిటిక్స్ మాత్రమే కాదు.. వరల్డ్ పాలిటిక్స్ కూడా తెలుసని అన్నారు. హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా చంద్రబాబును కలుస్తుంటానని, ఆయనతో మాట్లాడటం వలన తనకు కూడా రాజకీయాలపై కొంత అవగాహన పెరిగిందని చెప్పారు. 1996లోనే చంద్రబాబు తన విజన్-2020 ప్రణాళిక ద్వారా డిజిటల్ వరల్డ్ గురించి, ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగానికి ఉన్న భవిష్యత్ గురించి ఊహించి చెప్పారని, దీనిని అమలుచేసి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ను హైటెక్ సిటీగా మార్చారని గుర్తుచేశారు.
ఇక మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ లాంటి బిజినెస్ టైకూన్స్ చంద్రబాబును అభినందించారని, వారి కంపెనీలను హైదరాబాద్లో ప్రారంభించారని తెలిపారు. ఇప్పుడు లక్షలాదిమంది తెలుగువారు ప్రపంచ దేశాల్లో ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా, లగ్జరీగా బతుకుతున్నారంటే దానికి కారణం చంద్రబాబేనని స్పష్టం చేశారు. ఇక ఇటీవల రాష్ట్రాభివృద్ధికి సంబంధించి రూపొందించిన విజన్-2047 ప్రణాళిక గురించి చంద్రబాబు తనకు వివరించారని, అది కనుక సమర్ధవంతంగా అమలైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎక్కడికో వెళ్లిపోతుందని అన్నారు. అయితే ఇది కార్యరూపం దాల్చాలంటే చంద్రబాబుకు దేవుడి ఆశీస్సులు ఉండాలని, అలాగే దివంగత ఎన్టీఆర్ ఆత్మ ఆయనతో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.
ఇక తనకు ఆరేడేళ్ల వయసులో ఎన్టీఆర్ నటించిన ‘పాతాళభైరవి’ సినిమాను 1956-57లో మొదటిసారి చూశానని, తర్వాత తన మొదటి సినిమాలో కెమెరా ముందు ఫస్ట్షాట్లో పాల్గొన్నప్పుడు ‘భైరవి ఇల్లు ఇదేనా’ అనేది ఫస్ట్ డైలాగ్ అని, మూడు సంవత్సరాలు విలన్గా, సైడ్ కేరెక్టర్ ఆర్టిస్టుగా నటించిన తర్వాత తొలిసారి హీరోగా నటించిన సినిమా టైటిల్ ‘భైరవి’ అని గుర్తుచేసుకున్నారు. ఇక 1963లో ‘లవకుశ’ సినిమా విడుదల సందర్భంగా ఆయన ఒక థియేటర్కు వచ్చినప్పుడు మొదటిసారి ఎన్టీఆర్ను ప్రత్యక్షంగా చూశానని, 1966లో వచ్చిన ‘శ్రీకృష్ణ పాండవీయం’ సినిమాలో దుర్యోధనుడిగా ఎన్టీఆర్ నటన చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. కాగా తన 18వ ఏట బస్ కండక్టర్ అయ్యానని, ఈ సందర్భంగా ఒక నాటకంలో దుర్యోధనుడి పాత్ర వేసి ఎన్టీఆర్ను ఇమిటేట్ చేశానని, దీనిని చుసిన ప్రతి ఒక్కరూ అభినందించారని, ఫ్రెండ్స్ అందరూ వచ్చి నటుడిగా సక్సెస్ అవుతావని ప్రోత్సహించడంతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE