నారా చంద్రబాబునాయుడి కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. తండ్రి జైలు పాలుకావడం.. తననూ కేసులు చుట్టుముట్టడం.. పార్టీని నడిపించే బాధ్యత పెరగడం.. వంటి ఎన్నో సవాళ్లు, సమస్యలు ఆయన చుట్టూ ఉన్నాయి. ఇటువంటి క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ కొత్త చర్చకు దారి తీసింది. సాధారణంగా ఆయన ఒక్కరే వెళ్లి ఉండి ఉంటే.. తండ్రి అరెస్ట్.. విడుదల అవకాశాలు.. జగన్ పై ఫిర్యాదులు వంటి అంశాలు కారణమని ఊహించవచ్చు. కేవలం ఏపీ బీజేపీ చీఫ్ తోనే వెళ్లి ఉంటే.. కుటుంబ సభ్యురాలు.. మిత్రపక్షం జనసేనకు మిత్రురాలు కావడం వల్ల లోకేశ్ కు మద్దతుగా వెళ్లి ఉందేమో అని భావించొచ్చు. కానీ.. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా ఆ భేటీలో ఉన్నట్లుగా ఓ ఫొటో వెలుగులోకి రావడం కొత్త రాజకీయాలకు తెర లేపింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టైన తర్వాత సెప్టెంబర్ 14 నుంచి లోకేష్ ఢిల్లీలోనే ఉంటున్నారు. న్యాయవాదులతో సంప్రదిస్తున్నారు. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణలపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ పెద్దల్ని కలిసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరిగినా లోకేష్ వాటిని ఖండించారు. ఈ క్రమంలో మూడ్రోజుల క్రితం సిఐడి విచారణకు వచ్చిన లోకేష్ బుధవారం సాయంత్రం హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అమిత్షాతో లోకేష్ భేటీ అయ్యారు. ఈ భేటీలో లోకేష్తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నారు. అమిత్షాతో భేటీ ముగిసిన వెంటనే ఆ విషయాన్ని పురంధేశ్వరి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఆ తర్వాత నారా లోకేష్ ఫోటోలను విడుదల చేశారు. అందులో లోకేశ్ , చిన్నమ్మతో పాటు.. కిషన్ రెడ్డి ఉండడంతో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు ఉందని ప్రకటించేశారు. అంతకు ముందు నుంచీ ఆయన బీజేపీతో కలిసి నడుస్తున్నారు. మిత్రపక్షం బీజేపీని సంప్రదించకుండానే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. టీడీపీ – జనసేన బంధంపై బీజేపీ అధిష్ఠానం నుంచి ఇప్పటి వరకూ ఎటువంటి క్లారిటీ కానీ.. అనుకూలం, వ్యతిరేక ప్రకటనలు కానీ వెలువడలేదు. ఈ క్రమంలో అకస్మాత్తుగా బీజేపీకి ఏపీ, తెలంగాణ చీప్ లతో కలిసి లోకేశ్.. అమిత్ షాను కలవడం చర్చనీయాంశమైంది. కేవలం తండ్రికి గురించిన అంశాలపై అయితే.. వారితోనే కలిసి వెళ్లడం ఎందుకు..? పోనీ అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడం లేదన్న కారణం గురించి అయితే.. అందుకు చిన్నమ్మ ఉండనే ఉంది. మరి కిషన్ రెడ్డి వెంట ఎందుకు వెళ్లినట్లు అన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ.. తెలంగాణలోని ఆంధ్రప్రజలు కూడా రోడ్లపైకి వచ్చారు. జగన్ తీరుపై నిరసనలు వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కూడా ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు కు మద్దతుగా లోకేశ్ తో పాటు వెళ్లడం ద్వారా తెలంగాణ బీజేపీ కి దోహదం పడుతుందని కిషన్ రెడ్డి భావిస్తున్నట్లుగా ఓ వాదన ఉంది. ఆయన అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కాషాయ పార్టీ గ్రాఫ్ బాగా తగ్గింది. ఈ క్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన కిషన్ రెడ్డి ఈ భేటీలో పాల్గొనడం ద్వారా కొంత మైలేజీ తమకూ వస్తుందని భావించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. బీజేపీతో కలిసే ఉన్నానని ఇప్పటికీ జనసేనాని చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని ఆంధ్రా ఓటర్లు బీజేపీ పై సానుకూల ధోరణిలో కనబరుస్తారని కమలదళాదిపతి ఆశిస్తున్నట్లుగా ఉంది.
కిషన్ రెడ్డి సంగతి అటుంచితే.. వీరితో భేటీ లోకేశ్ కు ఎంత వరకూ కలిసి వస్తుందనే చర్చ జరుగుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర నాయకులపై ఏపీ ప్రభుత్వం పెడుతున్న కేసుల గురించి తెలుసుకోడానికి అమిత్షా పిలిపించారని లోకేష్ చెబుతున్నారు. అదే నిజమైతే.. ఆయనొక్కరే.. మహా అయితే చిన్నమ్మ తోడు గా వెళ్లాలి. మరి కిషన్ రెడ్డి ని వెంటబెట్టుకుని వెళ్లడం అనేది దేనికి సంకేతమో.. మున్ముందు తెలియాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE