గతానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఎన్నికలకు సుదీర్ఘ సమయం ఉండడంతో ప్రచారంలో ఎత్తులకు పైఎత్తులు వేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజలకు చేరువ అయ్యేందుకు కొత్తకొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. అధికార పక్షం కంటే.. ప్రతిపక్షం నలువైపులా రాష్ట్రాన్ని చుట్టేస్తోంది. పొత్తు పార్టీలు జనసేన, బీజేపీతో జట్టుకటడంతో కూటమి నేతలు తలోదిక్కున ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సైతం నిజం గెలవాలి అంటూ.. ఈసారి రాష్ట్రమంతా తిరుగుతున్నారు. తెలుగుదేశం కూటమిని గెలిపించాలని కోరుతున్నారు.
అవతలి నుంచి ఎంత మంది వచ్చినా నేను సిద్ధం.. అంటూ అధికారపక్షం నుంచి ఒకేఒక్కడుగా జగన్.. ప్రచారపర్వాన్ని రక్తికట్టిస్తున్నారు. తాజాగా.. మేమంతా సిద్ధం అంటూ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో ఊరూరా తిరుగుతున్నారు. కుట్రలతో.. కుతంత్రాలతో.. అందరూ కలిసి వస్తున్నారని, అధికారం కోసం తనపైకి చెల్లెళ్లను సైతం ఉసుగొలుపుతున్నారని విపక్షాలపై ఆరోపణలు సంధిస్తున్నారని. నాకు మీరే దిక్కు అంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ‘‘ఒక్క చాన్స్.. ఒక్క చాన్స్.. అన్న జగన్ మాయలో పడి వైసీపీని గెలిపించినందుకు 5 కోట్ల మంది ప్రజానీకం పెనుమూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఒక్క చాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని అథఃపాతాళానికి తొక్కేశాడు’’ అని తెలుగుదేశం కూటమి నేతలు సీఎం జగన్పై నిప్పులు చెరుగుతున్నారు.
2019లో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందంటూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఈ ప్రచారపర్వం లో కొన్నిచోట్ల ఉద్రిక్తతలూ చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడుతున్నారు. గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ అనుచరులు టీడీపీ మహిళా నాయకులపై దాడికి తెగబడ్డారు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆ మహిళా నేతలు కారులోనే ఉండి 100కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం గన్నవరం వైసీపీ కార్యాలయం గోడకు రంగులు, సిద్ధం బ్యానర్, జగన్ బొమ్మతో జెండా దిమ్మకు రంగులు ఉండటాన్ని గమనించిన మహిళలు.. ‘సీ-విజిల్’ యాప్లో అప్లోడ్ చేసేందుకు ఫొటోలు తీస్తున్నారు. దీన్ని గమనించిన వైసీపీ కార్యాలయంలో ఉన్న వంశీ అనుచరులు, కార్యకర్తలు 30 మంది కారును చుట్టుముట్టి మహిళలని కూడా చూడకుండా దాడికి పాల్పడినట్లు టీడీపీ ఫిర్యాదు చేసింది.
ఏపీలో మరో చాన్స్ కోసం.. ఒకవైపు జగన్.. మరోవైపు చంద్రబాబు కూటమి చేస్తున్న పోరుతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. గతానికి భిన్నంగా ఈసారి రాజకీయ పోటీ ఉండబోతుందని, ప్రచారానికి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ఎటువైపు మారతాయో ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితులు ఉన్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY