ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థను టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు ఆ పార్టీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ మేరకు ఆయన తన యువగళం పాదయాత్రలో భాగంగా 79వ రోజు సోమవారం, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం పెద్దతుంబళం క్రాస్ వద్ద సర్పంచులతో నిర్వహించిన ‘పల్లె ప్రగతి కోసం మీ లోకేశ్’ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నారా లోకేష్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన సర్పంచులతో ముఖాముఖీ నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి సర్పంచులు అడిగిన పలు ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఇచ్చారు. గ్రామీణాభివృద్ధికి టీడీపీ ఎలాంటి చర్యలు చేపట్టబోతుందో వివరించిన ఆయన, ఒక్క ఏడాది ఓపిక పడితే మీరందరూ కోరుకుంటున్న మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు.
ఇక టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తామని తాము ఏనాడూ చెప్పలేదని స్పష్టం చేసిన నారా లోకేష్, దీనిని పంచాయతీలకు అనుసంధానం చేస్తామని, తద్వారా మరింత మెరుగ్గా ప్రజలకు సేవలందిస్తామని వెల్లడించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులను పంచాయతీ ఖాతాల్లోకి మళ్లిస్తామని, ఈ నిధుల ద్వారా ప్రణాళికాబద్ధంగా తాగునీరు, వీధి దీపాలు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్యం, గ్రీన్ అంబాసిడర్ వంటి కార్యక్రమాలను పక్కాగా అమలు చేస్తామని నారా లోకేష్ వివరించారు. గ్రామాల్లో సర్పంచ్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఎమ్మెల్యేలు.. ఇలా అందరూ ఒకే లక్ష్యంతో సమష్టిగా పనిచేస్తే ఏపీ దేశంలోనే నెం.1 స్థానంలో నిలుస్తుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పల్లెలను పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చేస్తామని, వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతిపల్లెకు 24 గంటలూ తాగునీరు, ఇంటింటికీ కొళాయి ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ ఇదే కోరుకుంటున్నారని లోకేష్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ