బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ మృతిపై గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ సింగ్ కేసు దర్యాప్తును పాట్నా నుంచి ముంబయికి బదిలీ చేయమని కోరుతూ రియా చక్రవర్తి వేసిన పిటిషన్ను ఈ రోజు సుప్రీం కోర్టు విచారించింది. ఈ సందర్భంగా సుశాంత్ సింగ్ మరణంపై సీబీఐ దర్యాప్తు కోసం బీహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్టుగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. సుశాంత్ సింగ్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని బీహార్ సీఎం నితీశ్కుమార్ కేంద్రానికి అభ్యర్ధన పంపారు. ఇందుకు కేంద్రం అంగీకారం తెలపడంతో ఇకపై ఈ కేసును సీబీఐ విచారించనుంది.
ముందుగా ఈ కేసును ముంబయి పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో ఫిర్యాదు చేయడంతో బీహార్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాలలో విచారణ సందర్భంగా పలు సంఘటనలు చోటుచేసుకున్నాయి. అలాగే సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురై ఉంచొచ్చని సుబ్రమణ్యస్వామి, బీజేపీ నాయకుడు నారాయణ్ రాణె సహా పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ కేసు పలు మలుపులు తిరుగుతూ వస్తుంది. కాగా సుశాంత్ సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని మొదటినుంచే అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. తాజా కేంద్ర నిర్ణయంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu