దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 10,12 వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది. కరోనా వ్యాప్తి సమయంలో పరీక్షలు నిర్వహించకుండా రద్దు చేయాలనీ ఇటీవలే విద్యారుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ రద్దు అంశాన్ని పరిశీలించి నిర్ణయాన్ని తెలియజేయాలని సీబీఎస్ఈ బోర్డును కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో జూన్ 25, గురువారం నాడు సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. షెడ్యూల్ ప్రకారం జులై 1 నుంచి 15 మధ్య జరగాల్సిన సీబీఎస్ఈ 12వ తరగతి, 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు బోర్డు కోర్టుకు తెలిపింది. అలాగే ఐసీఎస్ఈ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
పదో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేయగా, 12వ తరగతి విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఇస్తున్నట్టు బోర్డు కోర్టుకు తెలిపింది. పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు హాజరు కావచ్చు, ఒకవేళ పరీక్షలకు హాజరుకావవద్దని భావిస్తే ఇంతకు ముందు నిర్వహించిన రెండు పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా సర్టిఫికెట్ తీసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించినట్లు సీబీఎస్ఈ కోర్టుకు వివరించింది. ఈ అవకాశం కేవలం 12 తరగతి విద్యార్థులకే ఇచ్చినట్టు తెలిపారు. ఇక పరీక్షకు హాజరయ్యే వారు, కానీ విద్యార్థుల వివరాలను జూలై 15న వెల్లడిస్తామని చెప్పారు. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించలేమని, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పరీక్షలు నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే రద్దు నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu