వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతులు శనివారం నాడు దేశవ్యాప్తంగా ‘చక్కా జామ్’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ మినహా దేశంలోని అన్నిరాష్ట్రాల్లో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో రైతులు, రైతు మద్దతుదారులు రహదారులను దిగ్బంధిస్తున్నారు. చండీఘర్, పంజాబ్, హర్యానా సహా ఇతర ప్రధాన నగరాల్లో రైతులు గుమిగూడి కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదం చేస్తూ, రోడ్లను దిగ్బంధిస్తున్నారు. రైతులు తలపెట్టిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సహా పలు పార్టీలు మద్ధతు ప్రకటించాయి.
మరోవైపు చక్కా జామ్ కార్యక్రమం ఢిల్లీలో నిర్వహించడం లేదని రైతులు హామీ ఇచ్చినప్పటికీ పోలీసులు అప్రమత్తమయ్యారు. గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఉద్యమం చేస్తున్న సింఘు, ఘాజీపూర్, టీక్రి ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించి పెద్ద స్థాయిలో భద్రతా ఏర్పాట్లను చేశారు. అదనపు బలగాలను మోహరించడంతో పాటుగా, బారికేడ్లు పెంచడం వంటి చర్యలు తీసుకున్నారు. జనవరి 26 న నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ తర్వాత రైతులు పిలుపునిచ్చిన కార్యక్రమం ఇదే కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ