ఇంతకుముందెన్నడూ లేని విధంగా కురుస్తున్న భారీ వర్షాలకు ‘సిలికాన్ సిటీ’గా పేరుగాంచిన బెంగళూరు జల దిగ్భంధంలో చిక్కుకుంది. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి సోమవారం తెల్లవారుదాకా ఒక్కరాత్రిలో 148 మిల్లీ మీటర్ల వర్షం కురవడంతో నగరం లోని అన్ని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ప్రధానంగా మారతహళ్లి, సంపంగి రామనగర్, సర్జాపుర రింగ్రోడ్డు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వందలాది ఐటీ కంపెనీలు కొలువుదీరిన సర్జాపుర, వైట్ఫీల్డ్, మారతహళ్లి ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. ఇక్కడ అపార్ట్మెంట్ సెల్లార్లలో నిలిపిన కార్లు, బైకులు నీట మునిగాయి. దీంతో పలు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ను ప్రకటించాయి.
రబ్బర్ బోట్లు, ట్రాక్టర్ల ద్వారా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇక విధాన సౌధ కూడా నీట మునిగినట్లు సిబ్బంది తెలిపారు. మరోవైపు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కూడా నీరు చేరడంతో పలు విమానాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నగరం మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి ఇంకో మూడు, నాలుగు రోజులు పెట్టొచ్చని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు నగరంలో కరెంటు సరఫరాకు అంతరాయం కలగడంతో ఇళ్ళల్లో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. త్రాగునీటి సమస్య అధికంగా ఉందని, మరో రెండు రోజులపాటు ఇది కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో.. రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వరదలపై వివరాలు అందించాలని అధికారులని ఆదేశించారు. నగరంలో వీధుల్లో నిలిచిపోయిన నీళ్లను తొలగించేందుకు రూ. 1500 కోట్లను తక్షణమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే అక్రమ కట్టడాలను తొలగించేందుకు మరో రూ. 300 కోట్లు ఇచ్చినట్లు సీఎం తెలిపారు. బెంగుళూరులో అసాధారణ రీతిలో వర్షపాతం నమోదు అయిందని, రెండు జోన్లు పూర్తిగా నీట మునిగాయని తెలిపారు. మున్సిపల్ ఆఫీసర్లు, ఇంజినీర్లు, వర్కర్లు, ఇతర సహాయక బృందాలు సమన్వయం చేసుకుంటూ 24 గంటలు పనిచేస్తున్నట్లు వెల్లడించారు.ప్రజలెవ్వరూ రోడ్లపైకి రావొద్దని, త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటామని వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ