నాగాలాండ్ లో జరిగిన కాల్పుల ఘటన దురదృష్టకరం అని పార్లమెంట్ లో హోమ్ మినిష్టర్ అమిత్ షా విచారం వెలిబుచ్చారు. శనివారం రాత్రి భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 14 మంది గిరిజనులు దుర్మరణం చెందారు. కాగా, ఈ విషయంపై పార్లమెంట్ లో హోమ్ మంత్రి అమిత్ షా వివరణ ఇచ్చారు. పార్లమెంట్ లో మాట్లాడిన హోమ్ మంత్రి.. జరిగిన ఘటనకు చింతిస్తున్నామని, మరోసారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సైన్యానికి సమాచారం వచ్చింది. వారు అక్కడకు చేరుకొని వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఒక వాహనంలో కొంత మంది అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. వారిని ఉగ్రవాదులుగా భావించిన సైన్యం కాల్పులు జరుపగా 6గురు మరణించారు. మిగిలిన వారికి బుల్లెట్ల గాయాలయ్యాయి. ఈ లోపు జరిగిన పొరపాటుని గుర్తించిన సైనం దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది.
ఈ ఘటనపై ఆగ్రహించిన అక్కడి స్థానికులు సైన్యంపై దాడి చేసారు. వారి వాహనాలకు నిప్పంటించారు. ఈ దాడిలో ఒక జవాను మరణించాడు. పరిస్థితులు అదుపు తప్పటంతో, సైన్యం ఆత్మరక్షణ కోసం మరోసారి కాల్పులు జరుపగా ఇంకో 7గురు మరణించారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్థానికులు కొందరు సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించగా.. వారిని అదుపు చేసేందుకు అసోం రైఫిల్స్ జరిపిన కాల్పుల్లో ఓ పౌరుడు చనిపోగా మరో ఇద్దరు గాయపడ్డారు. కాగా, ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో హోమ్ మంత్రి అమిత్ షా పార్లమెంట్ వేదికగా దీనిపై స్పందించారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని దేశ ప్రజలకు హామీనిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ