ఒడిశా ప్రభుత్వం 2018 నుండి భారత మహిళలు మరియు పురుషుల హాకీ జట్లకు అధికారిక స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో 10 సంవత్సరాల పాటు భారత హాకీ జట్లకు స్పాన్సర్ గా ఉంటామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం నాడు ప్రకటించారు. టోక్యో ఒలింపిక్స్-2020లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకంతో చరిత్ర సృష్టించింది. 41 సంవత్సరాల తర్వాత హాకీలో ఒలింపిక్ పతకం సాధించింది. అలాగే భారత మహిళల హాకీ జట్టు కూడా సంచనాలు నమోదు చేసింది. ఒలింపిక్ చరిత్రలోనే తొలిసారిగా సెమీఫైనల్ కు చేరుకుంది. అయితే తృటిలో కాంస్య పతకం కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచింది.
ఈ నేపథ్యంలో భారత మహిళా మరియు పురుషుల హాకీ జట్లును ఒడిశా ప్రభుత్వం మంగళవారం నాడు ఘనంగా సన్మానించింది. ముందుగా భువనేశ్వర్ చేరుకున్న హాకీ క్రీడాకారులు, క్రీడాకారిణిలకు ఘన స్వాగతం లభించింది. అనంతరం రెండు జట్ల క్రీడాకారులను సన్మానించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పాల్గొన్నారు. టోక్యో ఒలింపిక్స్-2020 లో చారిత్రాత్మక ఘనత సాధించిన హాకీ జట్లను సత్కరించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. వీరి విజయం ఎంతోమందికి క్రీడలను స్వీకరించడానికి మరియు దేశం కోసం పురస్కారాలను తీసుకురావడానికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. హాకీ ఇండియాతో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని, ఒడిశా ప్రభుత్వం హాకీ జట్లకు మద్దతునిస్తూనే ఉంటుందని అన్నారు. అలాగే సన్మాన కార్యక్రమంలో ప్రతి క్రీడాకారుడు, క్రీడాకారిణికి రూ.10 లక్షల నగదు బహుమతి అందించారు. రెండు జట్లకు చెందిన ప్రతి సహాయక సిబ్బందికి రూ.5 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ