పాకిస్థాన్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన పీఎంఎల్(ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు మహమ్మద్ షెహబాజ్ షరీఫ్కు అభినందనలు. ఉగ్రవాదం లేని ప్రాంతంలో శాంతి మరియు స్థిరత్వాన్ని భారతదేశం కోరుకుంటుంది. తద్వారా మనం అభివృద్ధి సవాళ్లపై దృష్టి సారించి, మన ప్రజల క్షేమాన్ని మరియు శ్రేయస్సును నిర్ధారించగలము” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ముందుగా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్ఖాన్ పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గత శనివారం రాత్రి ఓటింగ్ జరిగింది. ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 174 మంది సభ్యులు ఓటు వేయడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక సోమవారం నాడు ప్రధాని పదవీకై ప్రతిపక్షాలు అన్ని కలిసి పీఎంఎల్(ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ పేరును ప్రతిపాదించడం, పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు లభించడంతో ఆయన పాకిస్తాన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఈ ప్రధాని ఎన్నికకు ముందు ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) సభలో ఓటింగ్ ను బహిష్కరించింది. ఓటింగ్ సందర్భంగా ఆ పార్టీ చట్టసభ సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం పాకిస్థాన్ 23వ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ప్రధాని మోదీ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ