ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్కు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఎంఎంటీఎస్ రెండో విడత ప్రాజెక్టులో భాగంగా సికింద్రాబాద్-మేడ్చల్, ఫలక్నుమా-ఉందానగర్ సబర్బన్ రైలు సర్వీసులను కూడా ప్రారంభిస్తారు. ఇక ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్జైన్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు జే రామకృష్ణ తదితరులు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు పరిశీలించారు.
కాగా ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ద్వారా తయారు చేయబడిన సదరన్ జోన్లో ఇది రెండవ వందే భారత్ రైలు. తిరుమలకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అనేక రైళ్లలో ప్రయాణిస్తుంటారు. తిరుపతికి వందేభారత్ను ప్రవేశపెట్టాలని ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా భారతీయ రైల్వేలు సికింద్రాబాద్ మరియు తిరుపతి మధ్య ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ జంట నగరాల నుండి తిరుమలను సందర్శించే వేలాది మంది భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుందని దక్షిణ మధ్య రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఇక సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడపబడుతున్న మొదటి వందేభారత్ సెమీ-హై-స్పీడ్ రైలు చాలా విజయవంతమైంది. రైలు ప్రారంభించినప్పటి నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోందని అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో తిరుపతికి వందే భారత్ రైలు బీబీనగర్ మరియు గుంటూరు మీదుగా నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వర్గాలు వెల్లడించాయి. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్ను విజయవాడ మీదుగా నిర్వహిస్తున్నందున.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ వరంగల్, ఖమ్మంలను కలుపుతూ నల్గొండ, గుంటూరు ప్రయాణికులకు ఈ కనెక్టివిటీని అందించాలని రైల్వేశాఖ నిర్ణయించుకుంది. అయితే బీబీనగర్ – గుంటూరు సెక్షన్ను గరిష్టంగా 130 కి.మీ వేగంతో అప్గ్రేడ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సెక్షన్లో రైళ్లు గరిష్టంగా 110 కి.మీ వేగంతో నడపబడుతున్నాయి. సికింద్రాబాద్-బీబీనగర్, గుంటూరు-గూడూరు వంటి ఇతర విభాగాలు అప్గ్రేడ్ చేయబడ్డాయి. తిరుపతికి వందేభారత్ ఆమోదించిన తర్వాత, రైల్వే బీబీనగర్-గుంటూరు సెక్షన్ను కూడా అప్గ్రేడ్ చేస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE