బాలి వేదికగా జరుగుతున్న రెండు రోజుల కూటమి నేతల శిఖరాగ్ర సమావేశం (జీ20 సమ్మిట్) బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇండోనేషియా నుండి జీ20 అధ్యక్ష బాధ్యతలు భారత్కు లభించాయి. సభ్యదేశాల ప్రతినిధుల కరతాళ ధ్వనుల మధ్య ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో జీ20 అధ్యక్ష బాధ్యతలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అప్పగించారు. కాగా డిసెంబర్ 1 నుంచి భారతదేశం అధికారికంగా జీ20 అధ్యక్ష పదవిని చేపట్టనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. జీ20 అధ్యక్ష పీఠాన్ని భారత్ చేపట్టడం దేశంలోని ప్రతి పౌరుడికి గర్వకారణమని, అలాగే కూటమిలోని అన్ని దేశాలతో కలిసి తాము జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని ప్రపంచ సంక్షేమానికి ఉత్ప్రేరకంగా మార్చగలమని అన్నారు. ప్రపంచం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఆహారం మరియు ఇంధన ధరలతో పోరాడుతున్న సమయంలో భారతదేశం సమర్ధవంతంగా తన బాధ్యత స్వీకరిస్తుందని ఆయన అన్నారు.
అలాగే భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఈ జీ20 సమావేశాలను నిర్వహిస్తామని, తద్వారా దీనికోసం విచ్చేసే అతిథులకు భారతదేశం యొక్క అద్భుతమైన వైవిధ్యం, సమ్మిళిత సంప్రదాయాలు మరియు సాంస్కృతిక గొప్పతనానికి సంబంధించిన పూర్తి అనుభవాన్ని అందిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ఇక దీనిపై ఆయన తన ట్విటర్లో.. ‘వచ్చే ఏడాది జి-20 అధ్యక్ష పదవిని భారత్ చేపట్టనుంది. మా ఎజెండా అందరినీ కలుపుకొని, ప్రతిష్టాత్మకంగా, నిర్ణయాత్మకంగా మరియు కార్యాచరణ-ఆధారితంగా ఉంటుంది. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే మా విజన్లోని అన్ని అంశాలను గ్రహించేందుకు మేము కృషి చేస్తాము’ అని పేర్కొన్నారు. ఇక తన బాలి పర్యటనకు ముందు, ప్రధాని మోదీ భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీపై స్పందిస్తూ.. ‘వసుధైక కుటుంబం’ లేదా ‘ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ అని పేర్కొన్నారు.
కాగా జీ20లో యూరోపియన్ యూనియన్ సహా మొత్తం 19 దేశాలు ఉన్నాయి. అమెరికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే సభ్యదేశాలుగా ఉన్నాయి. మొత్తంగా, వారు ప్రపంచ జీడీపీలో 80 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం మరియు ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉన్నాయి. ఇక ఈ సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కూడా యుద్ధాన్ని విరమించాల్సిందిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు పిలుపునిచ్చారు. దీనికి పుతిన్ స్పందిస్తూ యుద్ధాన్ని ముగించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. దీంతో పాశ్చాత్య దేశాల మీడియా ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ప్రాముఖ్యతనివ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE