ఢిల్లీలో కరోనా ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజా కరోనా పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం నాడు అఖిలపక్ష పార్టీ సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఢిల్లీలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించని వ్యక్తులకు రూ.2 వేలు జరిమానా విధించనున్నట్టు తెలిపారు. ఇంతకుముందు మాస్క్ ధరించకుంటే ఫైన్ రూ.500 గా ఉండగా, ఇప్పుడు 2 వేలకు పెంచినట్టు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలను పక్కనబెట్టి ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలు సలహాలు, సూచనలతో సహకరించాలని కోరారు. అలాగే ఢిల్లీలోని బహిరంగ ప్రదేశాలలో మాస్కులు పంపిణీ చేపట్టాలని రాజకీయ పార్టీలకు, సామాజిక సేవ సంస్థలకు విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలో ప్రభుత్వ ఆసుపత్రులలో 663 మరియు కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కోవిడ్ కేంద్రాల్లో 750 సహా మొత్తం 1,400 ఐసీయూ పడకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. అలాగే ఈ రోజు నుంచి ప్రైవేట్ ఆసుపత్రులలోని 80 శాతం ఐసీయూ పడకలను కరోనా బాధితుల కోసం రిజర్వ్ చేయనున్నట్టు తెలిపారు. నగరంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుందని చాట్ పూజ సందర్భంగా కూడా ప్రజలు పెద్దఎత్తున ఒకేచోట గుమికూడొద్దని, ఇంట్లోనే జరుపుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ