గత కొన్నిరోజులుగా మహారాష్ట్ర రాష్ట్రంలో నెలకున్న రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన నేత ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాత్రి రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ఏక్నాథ్ షిండే చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే డిప్యూటీ సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేశారు. మహారాష్ట్రలో శివసేన నేత ఏక్నాథ్ షిండే తిరుగుబాటు అనంతరం ముఖ్యమంత్రి పదవీకి, ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేస్తున్నట్టుగా బుధవారం రాత్రి శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. దీంతో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం పడిపోయింది. పలు కీలక పరిణామాల అనంతరం కొత్తగా శివసేన, బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది.
ముందుగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండడంతో అందరూ భావించినట్టుగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కాకుండా, చర్చల అనంతరం శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నట్టు ప్రకటించింది. దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, కేబినెట్ లో బీజేపీ, శివసేనకు చెందిన నేతలు ఉండనున్నారని, తాను మాత్రం ప్రభుత్వంలో ఉండడం లేదని స్పష్టం చేశారు. అయితే బీజేపీ కీలక నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేస్తూ, “బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు దేవేంద్ర ఫడ్నవీస్ పెద్ద మనసుతో మహారాష్ట్ర రాష్ట్ర మరియు ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం మహారాష్ట్ర పట్ల ఆయనకున్న నిజమైన విధేయత మరియు సేవకు సంకేతమని, ఇందుకు ఆయనను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను” అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY