కరోనా మహమ్మారి దేశంపై దాడిచేస్తున్న వేళ కేంద్రప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాకు చెందిన ఒక కొత్త కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే, ఇందులో ఓ విశేషం ఉంది. ఇది సింగిల్ డోస్ వ్యాక్సిన్. కాగా, ఇప్పటివరకు మనదేశంలో వినియోగిస్తున్న వ్యాక్సిన్స్ అన్నీ రెండు డోసుల వ్యాక్సిన్సే. తొలిసారిగా సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. నిన్న (ఆదివారం) డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ కోవిడ్-19 వ్యాక్సిన్కు దేశంలో అత్యవసర వినియోగ అనుమతిని మంజూరు చేసింది. ఈ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూఖ్ మాండవియా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా.. డిసిజిఐ తీసుకున్న ఈ నిర్ణయం, కరోనా మహమ్మారిపై మనదేశం చేస్తున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆరోగ్య మంత్రి అన్నారు.
ఈ సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ తో వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింతగా ప్రజలకు చేరువవుతుందని కేంద్రం భావిస్తోంది. ఈ కొత్త వ్యాక్సిన్ చేరికతో దేశంలో ఉపయోగంలో ఉన్న వ్యాక్సిన్స్ సంఖ్య 9కి చేరుకుంది. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ రష్యా దేశంలోని గామలేయా సెంటర్ ద్వారా అభివృద్ధి చేయబడింది. స్పుత్నిక్ లైట్ మానవ అడినోవైరస్ వెక్టర్ ప్లాట్ఫామ్పై నిర్మించబడింది. రోగనిరోధక ప్రతిచర్యను ప్రేరేపించడానికి ఇది ప్రభావమంతంగా పనిచేస్తుంది. స్పుత్నిక్ లైట్.. భారతదేశం ఇంతకుముందు టీకా డ్రైవ్లో ఉపయోగించిన రష్యన్ టూ-డోస్ స్పుత్నిక్ V వ్యాక్సిన్ యొక్క కాంపోనెంట్-1 వలెనే ఉంటుంది. కాగా, భారతదేశం ఇప్పటివరకు వ్యాక్సినేషన్ డ్రైవ్లో దాదాపు 12 లక్షల డోసుల స్పుత్నిక్ Vను అందించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ