దాదాపు పాతికేళ్లకుపైగా పెండింగులో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు.. కేబినెట్ ఆమోదం తెలియజేయడనేది దేశ రాజకీయాల్లోనే ఒక కీలక పరిణామమనే చెప్పుకోవచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు చొరవ తీసుకోవాలని..ప్రతిపక్షాలు కొన్నాళ్లుగా డిమాండ్లు వినిపిస్తుండటంతో వాటన్నిటికి ఇప్పుడు ప్రధాని చెక్ చెప్పినట్లు అయింది.
నిజానికి మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు మరోసారి చర్చకు వచ్చింది. అయితే కొత్త పార్లమెంట్లో నిన్న ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్లో.. మహిళా బిల్లుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ బిల్లు రెండు సభల్లో పాస్ అయి.. రాష్ట్రపతి కనుక ఈ బిల్లకు ఆమోదం తెలిపితే చట్టరూపం దాలుస్తుంది. దీంతో చట్ట సభల్లో ఇకపై మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తప్పనిసరిగా వర్తింప చేస్తారు. అయితే ఇప్పటికిప్పుడు మహిళా బిల్లు చట్టరూపం దాల్చినా ..దాన్ని వెంటనే అంటే వచ్చే 2024 ఎన్నికల్లో అమలు చేసే అవకాశం మాత్రం లేదు.
మహిళా బిల్లును అమలు చేయాలి అంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ముగియాల్సి ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజన కోసం రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి ఉంటుంది. ఇంత సమయం కావాలి కాబట్టి 2026లోనే అది సాధ్యమవుతుంది. ఇప్పటికే మోడీ ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఎప్పుడో స్పష్టతనిచ్చింది. దీని ప్రకారం ఒకవేళ 2026లో నియోజకవర్గాల పునర్విభజన ప్రారంభమైతే.. ఆ కొత్త నియోజకవర్గాలు 2029కి గానీ అమలులోకి రావు. దీనిప్రకారం ఇప్పుడు మహిళా బిల్లు చట్ట ప్రకారం చట్టరూపం దాల్చినా కూడా.. 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళల 33శాతం రిజర్వేషన్లు అనేవి అమలులోకి వస్తాయి.
నిజానికి ఇది చాలా పెద్ద ప్రాసెస్. నియోజకవర్గాల పునర్విభజన చేసే సమయంలో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను గుర్తించడంతో పాటు మహిళా రిజర్వేషన్లు ఉండే లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా గుర్తించాలి. మరోవైపు ప్రతీ రాష్ట్రంలోనూ 33 % అసెంబ్లీ, లోక్సభ సీట్లతో పాటు ఎస్సీ, ఎస్టీల సీట్లు కూడా ఉండేలా చూస్తూ పునర్విభజన చేసే అవకాశం ఉండనుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేకించి మహిళల కోటా ఉండబోతోంది. దీని వెనుక ఇంత భారీ ప్రక్రియ ఉండటం వల్లే.. మహిళా రిజర్వేషన్లు ఇప్పటికిప్పుడు అమలు కాబోవని..కేవలం దీనిని తన ఎన్నికల ప్రచారంలో బ్రహ్మాస్త్రంగా మలచుకోవడానికి మాత్రమే తప్ప.. ఇప్పుడు మహిళలకు దీనిపై ఒరిగిందేమీ ఉండదన్న చర్చ జరుగుతోంది.
మరోవైపు 2026 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కనుక జరిగితే.. ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో కూడా అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉన్నాయి. తెలంగాణలో 119 నుంచి 153 నియోజకవర్గాలు,ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225 నియోజకవర్గాలు పెరుగుతాయి. మహిళా బిల్లు అమలయితే కనుక ..తెలంగాణలో 153 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 33 % అంటే దాదాపు 50 సీట్లు,అలాగే ఆంధ్రప్రదేశ్లో 225 నియోజకవర్గాల్లో దాదాపు 75 సీట్లు కేవలం మహిళలకు మాత్రమే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది.
దీనిని బట్టి చూసుకుంటే చట్ట సభల్లో ఇక నుంచి మహిళలే నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశం ఉంటుంది. అందుకే పాతికేళ్లుగా ఈ బిల్లు ప్రవేశ పెట్టడానికి చాలా ప్రభుత్వాలు ప్రయత్నించి విఫలం అయ్యాయి. తొలి సారిగా 1996 హెచ్డీ దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు మహిళా బిల్లును ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత వాజ్పేయి, మన్మోహన్ సింగ్ సర్కార్లు ఈ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టినపుడు.. రాజ్యసభలో ఆమోదం పొందింది కానీ లోక్ సభలో ఆమోదానికి నోచుకోలేకపోయింది. అప్పటినుంచి ప్రతిపక్షాలు మహిళా బిల్లుపై అప్పుడప్పుడు ప్రతిపక్షాలు నినాదాలు చేయడమే జరుగుతూ వచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE