అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడంటూ డెమోక్రటిక్ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ను పదవి నుంచి తొలగించేందుకు డిసెంబర్ 18, బుధవారం నాడు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దిగువ సభలో ప్రతిపక్ష డెమొక్రటిక్ సభ్యులు బలం ఎక్కువుగా ఉండడంతో అభిశంసన తీర్మానానికి సులభంగానే ఆమోదం లభించింది. దిగువ సభలో తీర్మానానికి అనుమతి లభించడంతో, ఎగువసభ అయిన సెనేట్లో ట్రంప్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ తీర్మానానికి సెనేట్ కూడా ఆమోదం లభిస్తేనే డెమోక్రటిక్ పార్టీ సభ్యులు తలపెట్టిన అభిశంసన ప్రక్రియ పూర్తవుతుంది.
అయితే సెనేట్లో ట్రంప్ కు చెందిన రిపబ్లికన్ పార్టీకి ఆధిపత్యం ఉండడంతో అభిశంసన ప్రక్రియ ఆమోదం పొందే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. జనవరి నెల మొదటివారంలో ట్రంప్ సెనేట్లో విచారణను ఎదుర్కోనే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్ష చరిత్రలో అభిశంసన ఎదుర్కొన్న మూడో అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ నిలిచారు. అయితే తీర్మానం ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు అభిశంసన ప్రక్రియను నిలిపివేయాలంటూ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీకి 30 పాయింట్స్ తో ట్రంప్ ఒక లేఖ రాశారు. అధ్యక్షుడిగా రాజ్యాంగం తనకు ఇచ్చిన హక్కులను ఈ పక్రియ కాలరాస్తుందని పేర్కొన్నారు. అయితే ట్రంప్ రాసిన లేఖను తాను పూర్తిగా చదవలేదని స్పీకర్ నాన్సీ పెలోసీకి వెల్లడించడం గమనార్హం.
[subscribe]