భారత్-చైనా సరిహద్దుల్లో గతకొన్ని నెలలుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు లోక్ సభలో ప్రకటన చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని, చైనాతో సమస్య పరిష్కారం కాలేదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 1962 సంవత్సరంలో లద్దాఖ్ లోని 90 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించిందని అన్నారు. దేశ సార్వభౌమత్వం, రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడేదిలేదని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. చైనా 1993 మరియు 1996 లో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను ఏకపక్షంగా ఉల్లంఘించిందని చెప్పారు. లద్దాఖ్ వద్ద సరిహద్దులను మార్చేందుకు చైనా చేసిన కుట్రను మన సైన్యం సమర్ధంగా తిప్పికొట్టిందని అన్నారు.
ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని భారత్ కోరుకుంటుందని, అయితే చైనా దూకుడుతో శాంతి ఒప్పందంతో పాటుగా, ద్వైపాక్షిక చర్చలపైనా కూడా ప్రభావం పడుతుందన్నారు. సరిహద్దు సమస్య తేలేంతవరకు ఎల్ఏసీని గౌరవించే నిర్ణయాన్ని చైనా పదే పదే ఉల్లంఘిస్తోందని చెప్పారు. కొన్ని నెలలుగా సరిహద్దుల్లో చైనా భారీగా సైన్యాన్ని మోహరిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో భారత్ కూడా సరిహద్దులకు సైన్యాన్ని తరలించిందన్నారు. చైనా ఏకపక్ష చర్యల్ని, కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని చెప్పారు. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. దేశం మొత్తం భారత సైన్యం వెంటే ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. చైనా సమస్యను చర్చలు, సంప్రదింపులు ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. ఇటీవల రష్యా రాజధాని మాస్కోలో చైనా రక్షణ శాఖ మంత్రితో జరిగిన సమావేశంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశామన్నారు. అలాగే గాల్వాన్ ఘటన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్దాఖ్ వెళ్లి సైనికులను కలసిన విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సభలో గుర్తు చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu