చైనా సహా మరికొన్ని ఇతర దేశాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం లోక్సభలో కీలక ప్రకటన చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 పరిస్థితిని సమీక్షిస్తున్నామని, అలాగే దేశంలో కోవిడ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సభకు హామీ ఇచ్చారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలపై ఆయన వివరించారు. గురువారం నుండి అంతర్జాతీయ ప్రయాణికులను ర్యాండమ్ గా పరీక్షించడం ప్రారంభించామని, దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని విమానాశ్రయాలకు సూచనలు చేశామని మాండవియా తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో మూడు ఒమిక్రాన్ సబ్-వేరియంట్ బీఎఫ్.7 కేసులను కనుగొన్నామని, రాష్ట్రాలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే మహమ్మారిని అరికట్టడానికై ప్రతి కోవిడ్ కేసు యొక్క జన్యు శ్రేణిని సకాలంలో నిర్వహించాలని అన్ని రాష్ట్రాలను కోరినట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు.
ఇంకా మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజలందరూ జాగ్రత్త వహించాలని, మరికొన్ని రోజుల్లో రానున్న క్రిస్మస్ మరియు నూతన సంవత్సరంతో సహా రాబోయే పండుగల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్లు ధరించాలని, శానిటైజర్లను ఉపయోగించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఎప్పటికప్పుడు మారుతున్న కరోనా వైరస్ స్వభావం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతోందని, పొరుగు దేశం చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు మరియు మరణాలను చూస్తున్నామని, స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఇక ఉభయ సభల సభ్యులు ముఖానికి మాస్క్లు ధరించాలని, శానిటైజర్లు వాడాలని, సామాజిక దూరం పాటించాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్తో పాటు ఎక్కువ మంది ఎంపీలు ఈరోజు పార్లమెంటులో ముఖానికి మాస్క్లు ధరించి కనిపించారు. మరోవైపు ప్రధాని మోదీ నేతృత్వంలో కోవిడ్-19 పరిస్థితిపై నేడు కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ