భారతీయ జనతా పార్టీకి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఇటీవల ఓ సమావేశంలో చెప్పారు. మమతా బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నాయకులే దేశంలో బీజేపీని అడ్డుకోగలరని చెప్పారు. కేటీఆరే కాదు.. గతంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వంటి ప్రముఖులు కూడా వెల్లడించారు. అయితే లోక్సభ ఎన్నికల సమయం వచ్చేసరికి బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఈ సారి ఇండియా కూటమి పేరుతో 27 పార్టీలు జతకట్టాయి. కూటమికి కాంగ్రెస్సే పెద్దన్న పాత్ర పోషిస్తోంది కానీ.. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వంటి నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు.
కూటమి ఏర్పాటుతో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనే పేరును ఆ పార్టీనే చెరిపేసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు దఫాలుగా కాంగ్రెస్ ఘోర ఓటమితో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలే కనిపించాయి. కూటమికి ముందు అనేక పేర్లు తెరమీదకు వస్తున్నాయి. వీరిలో నితీశ్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. అన్ని పార్టీలకూ తానే పెద్దన్న పాత్ర పోషించాలనే యోచనతో కూటమిని తెరపైకి తెచ్చింది. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఓటమితో ఎన్డీయేతర ప్రతిపక్షాల్లో జోష్ పెరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ జనాకర్షణకు తగ్గి కొంతకాలంగా మౌనంగా ఉంటున్న ప్రతిపక్షాలు కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత స్వరం పెంచాయి. చీలికలు పేలికలుగా ఉన్న తాము ఒక తాటిపైకి వస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గద్దె దించడం పెద్ద కష్టమేమీ కాదని డిసైడ్ అయ్యాయి. అంతేకాదు తరచుగా సమావేశాలు కావాలని కూడా నిర్ణయించుకున్నాయి.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యవహారంలో ప్రస్తుతం పరిస్థితులు మారినప్పటికీ.. తొలుత ప్రతిపక్షాల సమావేశానికి ఆయనే చొరవ తీసుకున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా భావసారూప్యతగల పార్టీలతో ఒక వేదికను ఏర్పాటు చేయడానికి బీహార్ ముఖ్యమంత్రి, జేడీ – యూ అగ్రనేత నితీశ్ కుమార్ ముందుకొచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించేయడానికి కాంగ్రెస్ ఒక్కటే సరిపోదని నితీశ్ కుమార్ తెగేసి చెప్పారు. కాంగ్రెస్, మిగతా ప్రతిపక్ష పార్టీలు ఒక తాటిపైకి వస్తేనే, బీజేపీ ముక్త్ భారత్ సాధ్యమవుతుందని స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధిపై ఎంపీగా అనర్హత వేటు వేసిన దగ్గర్నుంచి ఎన్డీయేతర ప్రతిపక్ష పార్టీలను ఒకతాటిపైకి తీసుకురావడానికి నితీశ్ కుమార్ ప్రయత్నాలు ప్రారంభించారు. 2024 లోక్సభ ఎన్నికలకు బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ప్రతిపక్షాలను ఒక వేదిక మీదకు తీసుకువచ్చేందుకు కృషి చేశారు. హఠాత్తుగా ఆయన యూ టర్న్ తీసుకున్నారు.
బీజేపీతో ఢీ అంటే ఢీ అనే మరో నాయకురాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ. ఆమె కూడా బీజేపీకి ప్రత్యామ్నయంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతతం కూటమితో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫైర్ బ్రాండ్ గా ఆమె రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ మూడోసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఆమె.. కూటమికి ముందు చాలాకాలంగా కాంగ్రెస్కు దూరంగా ఉన్నారు. మొదట్నుంచీ బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాల కిందట కూటమి కట్టడానికి మమతా బెనర్జీ తీవ్ర ప్రయత్నాలు చేశారు. 2019 లోక్సభ ఎన్నికలకు ముందే బీజేపీయేతర పార్టీల కూటమిలో కీలక పాత్ర పోషించడానికి మమతా బెనర్జీ ప్రయత్నించారు. కోల్కతాలో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించారు. అయితే రకరకాల కారణాల వల్ల మమత ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ.. కాంగ్రెస్ కు అంటీముట్టనట్లుగానే ఉంటూ.. భవిష్యత్ లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జాతీయ నాయకుడిగా ఎదుగుతున్నారు. 2012లో అవినీతిరహిత రాజకీయాలే సిద్ధాంతాలుగా కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్ పార్టీ పెట్టినప్పుడు చాలా మంది పెదవి విరిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కువ కాలం మనుగడ సాగించదని జోస్యాలు చెప్పారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జాతీయ రాజకీయాల్లో ఆప్ నిలదొక్కుకుంది. ఢిల్లీతో పాటు పంజాబ్లోనూ సత్తా చాటింది. బీజేపీ ఎత్తుగడలను, వ్యూహాలను తట్టుకుంటూ కేజ్రీ రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మాను తట్టుకుని ఢిల్లీకి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు… ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వాటిని తట్టుకుని ఆయన ఎదుగుతూనే ఉన్నారు. నితీశ్ మినహా మిగతా వారు ప్రస్తుతం కూటమిలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపినప్పటికీ.. అది కూటమి ప్రభావమే అన్న ప్రచారం తప్పా.. పార్టీ మైలేజీ తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE