భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై లైంగిక ఆరోపణలు చేస్తూ, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పునియా మరియు సాక్షి మాలిక్, ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేత వినేష్ ఫోగట్ వంటి స్టార్ రెజ్లర్లు గత మూడు రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్తో రెండో దఫా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెజ్లర్ల డిమాండ్లపై అనురాగ్ ఠాకూర్ సానుకూలంగా స్పందించారు. వారు కోరుతున్నట్లే దీనిపై విచారం జరిపిస్తామని, అప్పటివరకూ బ్రిజ్ భూషణ్ తన పదవికి దూరంగా ఉంటాడని హామీ ఇచ్చారు. దీంతో నిరసన విరమిస్తున్నట్లు రెజ్లర్ భజరంగ్ పూనియాతో పాటు ఇతర రెజ్లర్లు మీడియా ముందు వెల్లడించారు.
ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ .. లైంగిక వేధింపులు, ఆర్థిక దుర్వినియోగానికి సంబంధించిన అన్ని ఆరోపణలపై విచారణ జరుపుతామని, దీనిపై ప్రత్యేక సభ్యులతో కూడిన కమిటీ వేయాలని నిర్ణయించామని తెలిపారు. నాలుగు వారాల్లో కమిటీ విచారణ పూర్తి చేయనుందని, ఇక విచారణ ముగిసే వరకు, బ్రిజ్ భూషణ్ పక్కకు తప్పుకుని విచారణకు సహకరిస్తాడని పేర్కొన్నారు. అలాగే ప ర్యవేక్షణ కమిటీ డబ్ల్యూఎఫ్ఐ యొక్క రోజువారీ వ్యవహారాలను నిర్వహిస్తుందని, రెజ్లర్ల సమస్యలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కాగా రెజ్లర్ బజరంగ్ పునియా, ఠాకూర్ మాట్లాడుతూ.. కేంద్ర క్రీడామంత్రి నుండి తమకు హామీ లభించిందని, అందుకు కృతజ్ఞతలని పేర్కొన్నారు. చివరి ప్రయత్నంగా మాత్రమే తాము నిరసన మార్గాన్ని ఎంచుకున్నామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిజంగా తామందరికీ సహాయం చేస్తారన్న నమ్మకం ఉందని తెలియజేశారు. ఇకపై తమ పూర్తి దృష్టి అంతా ఆటపైనే కేంద్రీకరిస్తామని వెల్లడించారు.
మరోవైపు ఇండియన్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కూడా రెజ్లర్ల లేఖపై స్పందించింది. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు మరియు ఇతర కోచ్ లపై వచ్చిన ఆరోపణలపై ఏడుగురు సభ్యులతో ఐఓఏ ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. ఇక మిగిలిన వారిలో ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఎల్ఎఫ్) అధ్యక్షుడు సహదేవ్ యాదవ్, ఆర్చర్ డోలా బెనర్జీ, ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ యోగేశ్వర్ దత్ తదితరులు ప్యానెల్లో ఉన్నారు. అలాగే ఈ కమిటీలో మరో ఇద్దరు న్యాయవాదులు కూడా ఉంటారు. ఐఓఏ చీఫ్ పీటీ ఉష అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇతర అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE