అలనాటి అందాల తార శ్రీదేవి అంటే ఎంతోమంది సెలబ్రెటీలకు ఇప్పటికీ ఎంతో ఇష్టం. అందానికి నిలువెత్తు నిదర్శనంగా.. ఆమెను ఒక రోల్ మోడల్గా సినీ సెలబ్రెటీలు కూడా నేటికీ చెబుతూనే ఉంటారు. అయితే శ్రీదేవి తెరపై అందంగా కనిపించడానికి కేవలం ఉప్పులేని ఆహారాన్నే తీసుకునేదని, తనకు లోబీపి సమస్య ఉండటం వల్ల ఉప్పు మానేయటం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నా ఆమె పట్టించుకునేది కాదని..ఈ మధ్య శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
నిజమే శ్రీదేవి మాత్రమే కాదు..చాలామంది గ్లామర్ ఫీల్డులో ఉన్నవాళ్లు ఉప్పు వాడకాన్ని పెద్దగా ఇష్టపడరు. ఉప్పు శరీరంలో నీటిని నిలిచి ఉండేలా చేస్తుందని.. దాంతో మొహం ఉబ్బినట్టుగా కనబడుతుందంటూ చాలామంది సెలబ్రెటీలు ఉప్పుని మానేస్తుంటారు. అయితే ఉప్పుని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి చెడు చేయటం నిజమే. కానీ ఉప్పుని మరీ తగ్గించి తీసుకోవటం కూడా మంచిది కాదని.. అలా చేసినా ఆరోగ్యానికి నష్టం జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
అంతేకాదు ఉప్పుకి శరీరం స్పందించే తీరు కూడా అందరిలో ఒకేలా ఉండదు..అది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. వ్యక్తుల వయసుతో పాటు, బాడీ మాస్ ఇండెక్స్ కూడా ఉప్పు వాడకం ఆధారపడి ఉంటుంది. అంతేకాదు వారు జన్మించిన జాతి తెగ లాంటి అంశాలతో కుటుంబ సభ్యుల్లో బీపి తీరు వంటి కొన్ని అంశాలపై ఆధారపడి వ్యక్తుల శరీరాలపై ఉప్పు తన ప్రభావాన్ని చూపిస్తుంది. సాధారణంగా ఒక మనిషి రోజుకి అయిదు గ్రాముల వరకు ఉప్పుని తీసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతోంది.
సాధారణంగా ఉప్పుని ఎక్కువగా వాడితే రక్తపోటు పెరగడం, గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ వంటి ప్రమాదాలకు దారి తీస్తాయి. అలాగే ఉప్పుని తగ్గించినా కూడా ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు.
ఉప్పులో ఉండే ప్రధానమైన క్షార లోహం సోడియం. మనిషి శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైన ఖనిజాలలో ఇది ఒకటి. శరీరంలో కణాల పనితీరుకి, శరీరంలో ద్రవాల నిర్వహణకు, ఎలక్ట్రోలైట్లు సమతుల్యంలో ఉండటానికి సోడియం అవసరం అవుతుంది. క్యాల్షియం, క్లోరైడ్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియంలు సాధారణ ఎలక్ట్రోలైట్లు. ఇవన్నీ మనం తీసుకునే ఆహారం, ద్రవాల ద్వారా శరీరానికి అందుతుంటాయి.
శరీరంలో ఎలక్ట్రోలైట్లు సమతుల్యంలో లేకపోతే.. మనిషి ఆరోగ్యానికి హాని కలిగే అవకాశముంటుంది. అందుకే సాధారణ ఆరోగ్యంతో ఉన్నవారు ఉప్పు తగ్గించడం మంచిది కాదు. కాకపోతే మూత్రపిండాలు, గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు మాత్రం ఉప్పుని తగ్గించాలి.అలాగే డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు కూడా తక్కువ ఉప్పుని తీసుకోవాలి. డాక్టర్ల సలహా లేకుండా.. సాల్టుని బాగా తగ్గించేస్తే అది హైపోనేట్రీమియా అనే సమస్యకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.
శరీరంలో సోడియం బాగా తగ్గిపోతే ఏర్పడే పరిస్థితిని హైపోనేట్రీమియా అంటారు.ఈ పరిస్థితిలో శరీరంలో కండరాలు, కణాలు వాపునకు గురవుతాయి. అలాగే రక్తపోటుపైన కూడా ప్రభావం పడుతుంది. రోజుకి 2.4 గ్రాముల కంటే తక్కువ సాల్టును తీసుకోవటం వల్ల, సోడియం బాగా తగ్గిపోయి… మూత్రపిండాలు ఉప్పుని బయటకు పంపకుండా శరీరంలోనే నిలిపి ఉంచుతుంటాయి. ఇలాంటప్పుడు ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత ఏర్పడటంతో.. వారిలో కళ్లు తిరగటం, తలనొప్పి, అలసట, మగత లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.“
పిండిపదార్థాలను పూర్తిగా ఆపేసి ప్రొటీన్లు, కొవ్వులు ఉన్న కీటో డైట్ని ఫాలో అయ్యేవారిలో సోడియం స్థాయిలు తగ్గిపోయి మగత కమ్మినట్టుగా అనిపించే అవకాశాలు ఉంటాయి. హైపోనేట్రీమియా తక్కువగా లేదా మీడియంగా ఉంటే ఆ వ్యక్తికి అలసట, తలనొప్పి, వికారం, మగత, వాంతులు, శక్తి లేకపోవటం, కండరాల బలహీనత, నొప్పులు వంటి సమస్యలు కనిపించవచ్చు. ఇదే సమస్య మరీ ఎక్కువగా ఉంటే మాత్రం.. అది మూర్చ, కోమా, మెదడు గాయపడటం వంటి పెద్ద పెద్ద సమస్యలకు దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఉప్పు విషయంలో తమ సలహా లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.